హైదరాబాద్, ఆట ప్రతినిధి: బేస్బాల్కు తగిన గుర్తింపునివ్వాలని.. ప్రతిభ గల క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలని భారత బేస్బాల్ సమాఖ్య (బీఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. క్రికేటేతర క్రీడలకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని 20 రాష్ర్టాల బేస్బాల్ సంఘాలు ఏకమై భారత బేస్బాల్ ఫెడరేషన్ (బీఎఫ్ఐ)గా ఏర్పాటైంది. హైదరాబాద్లో ఆదివారం బీఎఫ్ఐ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా పద్మనాభన్ ఎన్నికయ్యారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ.. బేస్బాల్కు గుర్తింపు దక్కేలా తాము పని చేస్తామని తెలిపారు. త్వరలో నిర్వహించే సమావేశంలో బేస్బాల్ క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు.