పన్నెండో వసంతంలోకి ‘నమస్తే తెలంగాణ’
నేడు పదకొండో వార్షికోత్సవం
మన గడ్డపై నిలబడ్డ ఏకైక పత్రిక
నాటి నుంచి నేటి దాకా ప్రజల గొంతుక
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక.. మానస పుత్రిక
నాడు స్వరాష్ట్ర సాధనలో కీలక భూమిక
నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర
ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన బాధ్యత
కరీంనగర్, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక, అప్పుడే పదకొండు వసంతాలు పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, నేడు పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. 2011 జూన్ 6న తొలి సంచిక మొదలైనప్పటి నుంచి నేటి వరకు జనం వెన్నంటే ఉన్నది. తెలంగాణ పునర్మిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నది. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడమే కాదు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇంటింటికీ చేర్చడంతో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నది. సర్కారు ఏ పథకం తెచ్చినా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ప్రచురిస్తూ.. అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు దరఖాస్తు ఎలా చేసుకోవాలో సూచిస్తున్నది. అలాగే పేదలకు చేరుతున్న పథకాల గురించి సమగ్రంగా ప్రచురిస్తున్నది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణను కొంత మంది వ్యతిరేకించే ప్రయత్నం చేసినా.. చిన్న జిల్లాలతో కలిగే ప్రయోజనాలు వివరిస్తూ కండ్లకుగట్టింది. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పూనుకుంటే.. రైతులకు అవగాహన కల్పించింది. తెలంగాణ వస్తే కరెంటు కోతలు పెరుగుతాయని చెబితే.. అది అసత్యమని చూపించి 24 గంటల నిరంతర కరంటు సరఫరా చేస్తున్న తీరు.. దానికి వెనుక ముఖ్యమంత్రి దూరదృష్టి.. తద్వారా ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, అన్నదాతలు, ఇతర వర్గాలకు జరుగుతున్న ప్రయోజనాలను వివరించింది. గుక్కెడు నీటికోసం ఆడబిడ్డలు పడిన కష్టాలకు చెక్ పెట్టి.. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛజలం సరఫరా అవుతున్న తీరును ఫొటోలతో ప్రచురించింది.
ధర్మగంటలో బాధితులకు న్యాయం..
వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును ఎండగట్టింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో అక్రమాలను బయటపెట్టింది. అధికారుల లీలలతో నష్టపోయిన వేలాది మంది భూ బాధితులకు అండగా నిలిచింది. ‘ధర్మగంట’ పేరిట ప్రత్యేక కథనాలతో అవినీతిని వెలికితీసి, ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం చూపింది. ఎంతో మంది అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎండగట్టి, ఎంతో మందిపై వేటు పడేలా చేసింది. ఎన్నో అక్రమాలు వెలుగులోకిరాగా, ఆ తర్వాత సర్కారు ఏకంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇటు నిబంధనలకు నీళ్లొదిన ప్రైవేట్ దవాఖానల తీరును బహిర్గతం చేసింది. ఎన్నో దవాఖానల దోపిడీ తీరును వెలుగులోకి తెచ్చి, ఏకంగా దవాఖానలను సీజ్ చేసేలా చేసింది. ప్రభుత్వ వైద్యులే అయినా సేవలందించకుండా ప్రైవేట్, ల్యాబ్లు హాస్పిటళ్లు నడపడం వంటివి వెలుగులోకి తెచ్చి వేటు పడేలా చేసింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై కథనాలను ఇచ్చి, మెరుగైన వైద్య సేవలందేలా చూసింది. విద్యాశాఖలోని అక్రమాలను బహిర్గతం చేసింది. ఉపాధ్యాయుల సాధకబాధకాలను ఇవ్వడంతోపాటు దారితప్పిన పంతుళ్లు గాడిన పడేలా చేసింది. సంఘాల వివాదాలను, నకిలీ బిల్లులు, నకిలీ సర్టిఫికెట్ల బాగోతాలను, బది‘లీలలు’, ఇతర దందాలను ఎన్నింటినో బయటికి తెచ్చింది. అవినీతి, అక్రమాలతోపాటు ఓ పోలీస్ అధికారి వడ్డీ దందాలపై ప్రచురితమైన వరుస కథనాలు ప్రచురించి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పేదల కన్నీళ్లకు అక్షరరూపం
పేదలు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నది.వారి కష్టాలను, కన్నీళ్లను అక్షర రూపం ఇచ్చి, ఎందరికో సాయం అందేలా చేసింది. అనాథలు, వైద్య సాయం కోసం చూసే అసహాయుల బాధలను కండ్ల ముందుంచి వందలాది మందికి ఆపన్నహస్తం అందించింది. వేలు, లక్షల రూపాయల నగదు సాయం అందడమే కాదు, అనారోగ్యం పాలైన ఎంతో మందికి తిరిగి ప్రాణాలను కాపాడుతున్నది. కరోనా నేపథ్యంలో అనవసర భయాలు, అపోహలు తొలగించేలా కథనాలను ఇచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలు, ఏయే వైద్యశాలలో ఎలాంటి వసతులున్నాయి? ఇలా పూర్తి సమాచారం ఇచ్చింది. అలాగే వైద్యుల సలహాలతోపాటు మానసిక నిపుణులు, కోలుకున్న పేషెంట్ల సూచనలు ఇస్తూ, మానసిక ధైర్యం పెంపొదేలా చేసింది. ఇప్పటి వరకు అదే తీరున కథనాలు ఇస్తూ, భరోసా ఇస్తున్నది. సర్వసతీ పుత్రులకు పేదరికం ఒక శాపంగా మారితే.. మానవీయ కోణంలో వార్తలు ప్రచురించి వారికి అండగా నిలిచింది. ఒకటి రెండు కాదు.. సర్వ జనహితమే లక్ష్యంగా సాగుతున్న ‘నమస్తే తెలంగాణ’ ప్రస్తుతం మరో కీలక భూమిక పోషిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 80వేల పోస్టుల భర్తీకి పూనుకోగా.. అందులో మన ప్రాంత బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్నా లక్ష్యంతో నిపుణుల సలహాలు, ప్రామాణిక స్టడీ మెటీరియల్తో ఇప్పటికే ప్రత్యేకంగా ‘నిపుణ’ ఇస్తున్నది. ఉగాది పర్వదినం నుంచి ప్రతిరోజు జిల్లా టాబ్లాయిడ్లో నాలుగు పేజీలు (ఇంగ్లిష్, తెలుగు మీడియంలో), ప్రతి బుధవారం ఎనిమిది పేజీల ప్రత్యేక అనుబంధం ఇస్తున్నది. తాజాగా పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తూ.. అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
‘నమస్తే తెలంగాణ’కు రుణపడి ఉంటా
కౌటాల, జూన్ 5: 2021 సెప్టెంబర్లో నీట్ పరీక్ష రాసిన. నీట్లో ఆల్ ఇండియా ర్యాంకు 1,11,479 (471 మార్కులు) వచ్చింది. సర్కారు కోటాలో ఫిబ్రవరి 5(2022)న హైదరాబాద్లోని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్-రీసెర్చ్లో ఎం బీబీఎస్ సీటు వచ్చింది. ఈ విషయం తెలిసి ఆనందించలేని పరిస్థితి నాది. డాక్టర్ చదువుకు ఎంత ఖర్చు అయితది బిడ్డ అని అమ్మానాన్న రేఖ-జనార్దన్ అడిగిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఏడాదికి రూ. 3 లక్షల దాకా ఖర్చు అవుతాయని చెప్పిన. మాది నిరుపేద కుటుంబం. ఇక చదువుకోవడం కష్టమేననిపించింది. అప్పుడే ‘నమస్తే తెలంగాణ’లో ఫిబ్రవరి 13వ తేదీన ‘చదువుల తల్లికి సాయమందించరూ’ పేరిట కథనం ప్రచురితమైంది. ఇందుకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు స్పందించి నాకు భరోసానిచ్చారు. డాక్టర్ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని చెప్పారు. స్వయంగా హైదరాబాద్కు తీసుకపోయి అపోలో మెడికల్ కళాశాలలో ఫీజు కట్టి జాయిన్ చేయించాడు. హాస్టల్ వసతి కూడా కల్పించారు. నా భవిష్యత్కు దారి చూపిన ‘నమస్తే తెలంగాణ’కు, ఎమ్మెల్యే సారుకు జీవితాంతం రుణపడి ఉంటాను.
-చహరే కరిష్మ, ఎంబీబీఎస్ విద్యార్థి