హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): మన ఇంటి మీదే కరెంట్ తయారు చేసుకొంటే? కరెంటు కోతలతో సంబంధం లేకుండా ఇంటికి కావాల్సినంత విద్యుత్తును గాలితోనే ఉత్పత్తి చేసుకొంటే? ఎంత గాలి వీస్తే అంత కరెంట్, ఎంతసేపు వీస్తే అంతసేపు ఉత్పత్తి. దానికి ఓ పంక తోడుంటే సరిపాయే. గాలితో, ఇంటిపైనే విద్యుత్తును తయారుచేసుకొనే ఆ పంకను ఆర్కిమెడిస్ గ్రీన్ ఎనర్జీస్ సంస్థ అభివృద్ధి చేసింది. రూఫ్టాప్ విండ్ మిల్స్ పేరున్న ఈ పంకతో సగటు గాలి వేగంతో 1 కిలోవాట్ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ వ్యవస్థాపకుడు సూర్యప్రకాశ్ తెలిపారు.
గృహానికి వినియోగించే సగం విద్యుత్తును దీని ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన రీన్యూ ఎక్స్-2021 ప్రదర్శనలో విండ్ మిల్ను ప్రదర్శించామని, కొరియన్ కంపెనీ ఎస్కో ఆర్టీఎస్ భాగస్వామ్యం, నెదర్లాండ్ టెక్నాలజీతో హైదరాబాద్లోని గీతం వర్సిటీతో కలిసి స్థానికంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. మేడ్చల్లో రెండెకరాల స్థలంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటుచేశామని, ఇక్కడి నుంచే దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సంస్థ రెండు రకాల టర్బైన్లను తయారు చేస్తున్నది. ఇందులో 36 కేజీలతో చిన్నవి, 112 కేజీలతో పెద్దవి ఉన్నాయి. విండ్ మిల్ టర్బైన్లు ఎక్కువ శక్తిని, తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. పక్షులకు హాని కలిగించవు. నిర్వహణ, ఖర్చులేని టర్బైన్ను అపార్టుమెంట్పై, పొలాల్లో ఇలా ఎక్కడైనా అమర్చుకోవచ్చు. 360 డిగ్రీలు తిరుగుతుంది. విండ్ మిల్ మూడు వృత్తాకార బ్లేడ్లను కలిసి ఉంటుంది. ప్రత్యేక డిజైన్ గాలిని టర్బైన్లోకి లాగుతుంది. ఇవి 0.9 మీటర్/సెకను నుంచి 14 మీటర్లు/సెకను వరకు తక్కువవేగం ఉన్న గాలులలోనే పనిచేస్తుంది. 22 మీటర్లు/సెకనుకు వంటి అధిక గాలులు వచ్చినప్పుడు పాడవకుండా ఉండేందుకు టర్బైన్ ఆగిపోతుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 25: సీబీఎస్ఈ స్కూళ్లలో చేరాలనుకునే విదేశీ బోర్డుల విద్యార్థులకు ఇకపై ముందస్తు అనుమతి అక్కర్లేదని సీబీఎస్ఈ గురువారం ప్రకటించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో అనేక కుటుంబాలు విదేశాల నుంచి భారత్కు తిరిగి వచ్చాయని, దీంతో విదేశాల్లో చదువుకున్న చాలామంది విద్యార్థులు సీబీఎస్ఈ స్కూళ్లలో చేరుతున్నారని సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాన్యం భరద్వాజ్ తెలిపారు. ఈ క్రమంలో ఆ విద్యార్థులకు, కుటుంబాలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నట్టు పేర్కొన్నారు.