హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యే కోటా నుంచి నామినేషన్లు వేసిన ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ్యుల కోటాలో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత అసెంబ్లీలో తమకున్న బలాన్ని దృష్టిలో ఉంచుకున్న టీఆర్ఎస్ మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇతర పార్టీలకు నామమాత్రపు సభ్యులే ఉన్న నేపథ్యంలో ఎవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో టీఆర్ఎస్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, పాడి కౌశిక్రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన వెంటనే వారి ఎన్నికను ధ్రువీకరించారు. ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఆరుగురు అభ్యర్థులకు గెలుపు ధ్రువపత్రాలు అందించారు.
సందడిగా అసెంబ్లీ ప్రాంగణం
శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పాడి కౌశిక్రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు తమ ఎన్నిక ధ్రువపత్రాలను తీసుకొనేందుకు సోమవారం సాయంత్రం అసెంబ్లీకి చేరుకున్నారు. అప్పటికే వారి అభిమానులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున తరలివచారు. దీంతో ఆ ఆవరణ అంతా సందడిగా మారింది. రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి తదితరులు కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.