MLC By Election | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నదా? పరీక్షను వాయిదా వేయాల్సిందేనా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మే 27న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. అయితే మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
పోలింగ్ రోజు ఆయా జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్ పరీక్షకు హాజరయ్యేవారంతా పట్టభద్రులేకానుండటంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇప్పటివరకు ఏ తేదీన ఏ పేపర్కు పరీక్ష నిర్వహిస్తారో వెల్లడించలేదు. ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా పేపర్ల వారీగా పరీక్షలు నిర్వహించే తేదీలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.