కంటేశ్వర్ ( నిజామాబాద్) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను (Education standards ) పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanth) సూచించారు. అప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
పదవ తరగతి( Tenth Class) వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ వారికి దిశా నిర్దేశం చేశారు. మార్కులు(Marks), గ్రేడ్ పాయింట్లు (Grade Points) ప్రామాణికం కాకుండా, విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ, ఇష్టపడి చదువుకోవాలనే కోరికను వారిలో పెంపొందించాలన్నారు.
ప్రాథమిక దశ నుండే విద్యార్థులలో చదువు పట్ల శ్రద్ధను కలిగిస్తే, వారు ఏకాగ్రతతో విద్యను నేర్చుకుని సత్ఫలితాలు సాధించగల్గుతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతి సౌకర్యాలు ఎంతో మెరుగ య్యాయని, ప్రభుత్వం నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తోందని గుర్తు చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపించిన దృష్ట్యా, ప్రణాళికాబద్ధంగా బోధన చేస్తూ సిలబస్ (Syllabus)ను పూర్తి చేయాలన్నారు.
ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో తానూ ఆయా పాఠశాలలను తనిఖీ చేసిన సందర్భంలో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సామర్ధ్యాన్ని పరీక్షించినప్పుడు విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా కనిపించలేదని కలెక్టర్ ఆరోపించారు. డీఎస్సీ (DSC) ద్వారా కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు జరిగినందున దాదాపుగా అన్ని పాఠశాలల్లో టీచర్ల ఖాళీలు భర్తీ అయ్యాయని, సమయపాలనను పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.
ఈ సందర్భంగా అపార్ ఐ.డీలు జనరేట్ చేయడంలో ముందంజలో నిలిచిన ఐదుగురు హెచ్.ఎం లను, ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఐదుగురు కాంప్లెక్స్ పాఠశాలల హెచ్.ఎంలను కలెక్టర్ సత్కరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, పరీక్షల నియంత్రణ విభాగం అధికారి విజయభాస్కర్, ఎంఈవోలు, హెచ్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.