దొందూ దొందే..
ఇప్పటిదాకా చేసిన 105 సవరణల్లో ఇటువంటి శూలాలు ఎన్నో. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక సవరణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. మనకు ఏ పాటి రాజ్యాంగం మిగిలింది? ఏం చేద్దాం?
రాజ్యాంగాన్ని పూర్తిగా సవరించే అధికారం నిజంగా రాజ్యాంగం ఇచ్చిందా అని అనుమానం వస్తుంది. 368వ అధికరణం చూడండి.
‘ఈ రాజ్యాంగంలో ఏమి ఉన్నప్పటికీ, పార్లమెంటు తన మౌలికమైన అధికారాన్ని వినియోగించుకొని ఈ రాజ్యాంగంలోని ఏ నియమాన్నైనా చేర్చడం, మార్చడం, తొలగించడంతో (కింద నిర్దేశించిన ప్రక్రియ ద్వారా) సవరించవచ్చు’.
ఎంత విస్తృతమైన అధికారం. ఈ 368వ అధికరణాన్నే కనీసం ఐదు సార్లు మార్చి, తన అధికారాన్ని పార్లమెంట్ మరింత విస్తరించుకున్నది. అంటే ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి, తొలగించే అధికారం కూడా ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. మార్చుకోవచ్చు కానీ పూర్తిగా అన్ని నియమాలు తీసేసి కొత్త నియమాలు పెట్టడానికి వీల్లేదని 368లో లేదు. కొత్త నియమాలు చేర్చడానికి వీల్లేదనీ లేదు, కనీసం కొన్ని మూలమైన ఆర్టికల్స్ను తొలగించడానికి వీల్లేదని కూడా లేదు.
మొత్తం మార్చుకోవచ్చు: అంబేద్కర్
ఈ రాజ్యాంగాన్ని 368వ అధికరణం ద్వారా పూర్తిగా మార్చుకునే అధికారాన్ని ఇచ్చిందని అంబేద్కర్ 1949, నవంబర్ 25 నాటి చివరి ప్రసంగంలో తుది ప్రతి సారాంశాన్ని వివరిస్తూ విమర్శలకు సమాధానం ఇలా చెప్పారు.
‘ఈ రాజ్యాంగంలో సమకూర్చిన ఈ సూత్రాలన్నీ ఈ తరం అభిప్రాయాలు. ఈ మాట అతిశయోక్తి అంటారా, అయితే ఈనాటి రాజ్యాంగసభలో సభ్యుల అభిప్రాయాలు అందాం. అమెరికా రాజనీతివేత్త థామస్ జెఫర్సన్ మనం విస్మరించడానికి వీల్లేని ఒక మాట చెప్పారు. ‘ప్రతి తరాన్ని ఒక విభిన్నమైన జాతి (నేషన్=దేశం)గా పరిగణించాలి. ఆ జాతి మెజారిటీ ద్వారా తమ అధికారాలను పరిమితం చేయవచ్చు. ఏ విధంగానైతే మరో దేశంలో నివసించేవారి పైన అధికారం చెలాయించే వీల్లేదో ఆ విధంగానే తర్వాత తరాన్ని నిబంధనలతో బంధించే అధికారం లేదు’.
మరో సందర్భంలో జెఫర్సన్ ఇలా అన్నారు.. ‘ఒక జాతి (దేశం-నేషన్) కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు (రాజ్యాంగ వ్యవస్థ), లక్ష్యాలు నెరవేర్చడం కోసమైనా అసలు ముట్టుకోవడానికి, మార్చుకోవడానికి వీల్లేదనడం, అది నియంతల దుర్మార్గాలను ఆపగలుగుతాయేమో గాని, ఒక జాతికి వ్యతిరేకమైన, నిరర్థకమైన నియమం. మన ముందు తరాలు మన కన్న ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాయనేది మన న్యాయవేత్తలు, మతాచార్యులు మనకు నేర్పిన సిద్ధాంతం. అదే ధోరణిలో మనం భావితరాల తలలపైన మార్చడానికి వీల్లేని భారమైన చట్టాలను పెట్టి, భావితరం మార్చడానికి వీల్లేదనడం బాగానే ఉంటుంది, ఎప్పుడంటే భూమ్మీద అందరూ నిర్జీవంగా ఉన్నపుడు, అంతేకానీ బతికున్న భూమి కోసం కాదు’. దీన్ని సమర్థిస్తూ అంబేద్కర్ ఏమన్నారంటే.. ‘ఇది కేవలం నిజం కాదు. పరమసత్యం. నిస్సందేహం. ఒకవేళ జెఫర్సన్ సూత్రాన్ని విస్మరించి ఉంటే రాజ్యాంగ రచనాసభను నిందించడమే కాదు, ఖండించినా సమంజసమే’. కనుక రాజ్యాంగ రచనాకాలం, మొదటి రిపబ్లిక్ డే నుంచే అపరిమితమైన సవరణాధికారాలను ఇచ్చుకున్నారు.
ఈ 368వ అధికరణాన్నే కనీసం ఐదు సార్లు మార్చి, తన అధికారాన్ని పార్లమెంట్ మరింత విస్తరించుకున్నది. అంటే ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి, తొలగించే అధికారం కూడా ఇచ్చిందని అర్థం చేసుకోవాలి. మార్చుకోవచ్చు కానీ పూర్తిగా అన్ని నియమాలు తీసేసి కొత్త నియమాలు పెట్టడానికి వీల్లేదని 368లో లేదు. కొత్త నియమాలు చేర్చడానికి వీల్లేదనీ లేదు, కనీసం కొన్ని మూలమైన ఆర్టికల్స్ను తొలగించడానికి వీల్లేదని కూడా లేదు.
రాజ్యాంగాన్ని కూలంకషంగా మార్చుకోవడానికి రిఫరెండం ఉండాలనే నియమాలు కొన్నిదేశాలు పెట్టుకున్నాయి. కొన్ని రాజ్యాంగాలలో ఫలానా నియమాలను అసలు మార్చడానికి వీల్లేదని కూడా చేర్చుకున్నాయి. కానీ మన రాజ్యాంగంలో అటువంటి పరిమితులేమీ పెట్టుకోలేదు. సవరణ సులువుగా ఉంటేనే మార్పు కోసం విప్లవాలు రావాలసిన అవసరం ఉండదని, కనుకనే సవరణలను అసాధ్యం చేసే కఠినమైన రాజ్యాంగం రాసుకోలేదని అంబేద్కర్ వివరించారు. కానీ దీనివల్ల నియంతలకు విపరీత అధికారాలు వచ్చి రాజ్యాంగాన్ని నీరుగార్చుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ఎన్నింటినో చెల్లకుండా చేసే విధంగా రాజ్యాంగాన్ని మార్చారు.
రాజ్యాంగాన్ని కూలంకషంగా మార్చుకోవడానికి రిఫరెండం ఉండాలనే నియమాలు కొన్ని దేశాలు పెట్టుకున్నాయి. కొన్ని రాజ్యాంగాలలో ఫలానా నియమాలను అసలు మార్చడానికి వీల్లేదని కూడా చేర్చుకున్నాయి. కానీ మన రాజ్యాంగంలో అటువంటి పరిమితులేమీ పెట్టుకోలేదు. సవరణ సులువుగా ఉంటేనే మార్పు కోసం విప్లవాలు రావాలసిన అవసరం ఉండదని, కనుకనే సవరణలను అసాధ్యం చేసే కఠినమైన రాజ్యాంగం రాసుకోలేదని అంబేద్కర్ వివరించారు.
జనమే రక్షించుకోవాలి
అధికారపార్టీని ఓడించిన ఓటర్లు ఒకవైపు, సుప్రీంకోర్టు మరొకవైపు రక్షించడం వల్ల రాజ్యాంగం గానీ ప్రజాస్వామ్యం గానీ, ప్రాథమిక హక్కులు గానీ ఈ మాత్రం మిగిలాయి. 1973లో కేశవానంద భారతి కేసులో 13 మంది న్యాయమూర్తుల సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం, ఏ అధికరణాన్నయినా సవరించుకోవచ్చు కానీ, మౌలిక స్వరూపం మార్చడానికి వీల్లేదనే చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. అయినా 1975లో ఎమర్జెన్సీ విధించి 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలోని గణనీయమైన అంశాలను బలహీనం చేశారు. కేశవానంద కేసులో సవరణ అధికారాలపై పరిమితి విధించిన ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను కాదని నాలుగో స్థానంలో ఉన్న జడ్జిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆ ముగ్గురు రాజీనామా చేశారు. మరో సందర్భంలో ప్రాథమిక హక్కులను ఎమర్జెన్సీలో కూడా హరించడానికి వీల్లేదనే తీర్పు చెప్పినందుకు హెచ్.ఆర్.ఖన్నాను ప్రధాన న్యాయమూర్తి కానీయలేదు. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ను ఓడించి జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ రాజ్యాంగ సవరణ చేసి హానికరమైన నియమాలన్నింటినీ తొలగించి రాజ్యాంగాన్ని పునరుద్ధరించారు. అయినా ఆ తర్వాత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పూర్తిగా బలహీనపరచే సవరణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పటిష్ఠపరిచి ప్రాథమిక హక్కులకు మరింత భద్రతనిచ్చే కొత్త రాజ్యాంగాన్ని కోరటం తప్పు కాదు.
(వ్యాసకర్త: డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ; కేంద్ర సమాచార మాజీ కమిషనర్)
ఫ్రొఫెసర్
మాడభూషి శ్రీధర్