రేడియో.. ఒకప్పుడు ఇంటిల్లిపాది ఆరాధ్య దైవం.. శ్రోతల ప్రపంచానికి మహారాజ్ఞి.. ప్రిస్టేజ్ సింబల్.. ఆబాలగోపాలానికి అత్యంత ప్రియ నేస్తం… రేడియో.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి.. మన సంస్కృతిని సజీవంగా నిలిపిన ఓషధి.. జాతీయ సమైక్యతకు సారథి.. కళాకారులకు పెన్నిధి.. ఒక్కమాటలో చెప్పాలంటే.. రేడియో కల్పతరువు, కామధేనువు.
ఇది ఏదో అంత్యప్రాసతో ఆవేశంతో భావోద్వేగంతో చెప్పిన కవిత కాదు. రేడియో మూలాలను వెల్లడించే అక్షరసత్యాలు. జాతీయ పతాకం వలె, మన జాతి గుండె చప్పుడును నిరంతరం వినిపిస్తున్న స్వర సంస్కృతికి ప్రతీకయైన మన ఆకాశవాణికి వాటిల్లబోతున్న ముప్పు గురించిన ఆవేదన ఇది. మూతబడనున్న ప్రభుత్వరంగ సంస్థలలో చేరబోతున్న ఆకాశవాణి.. విషాదయోగినిగా మారిన వైనం ఇది. ఒకసారి గత చరిత్రను పరికిస్తే..
మన దేశంలో రేడియో ప్రసారాలు 1923 జూన్ లో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా తొలిసారిగా ప్రసారమయ్యాయి. 1927లో బొంబాయిలోనే ‘ఇండియన్ బ్రాడ్కాస్టింగ్’ పేరుతో తొలి రేడియో స్టేషన్ ప్రారంభమైంది (1936లో ఆలిండియా రేడియోగా మార్చారు). హైదరాబాద్ రాజ్యంలో 1935 ఫిబ్రవరి 3 నుంచి దక్కన్ రేడియో ప్రసారాలు ప్రారంభమైనాయి. ఇవి ఉర్దూలో ఉండేవి. తదనంతర కాలంలో మాడపాటి హనుమంతరావు తదితరుల కృషితో తెలుగులో కూడా రేడియో కార్యక్రమాలు ప్రసారమైనాయి. 1935లో మైసూరు సం స్థానం వారి ప్రైవేటు రేడియో కార్యక్రమాలు ఆకాశవాణి పేరుతో మొదలయ్యాయి. 1956లో ఆలిండి యా రేడియోతోపాటు ఆకాశవాణి పేరును అధికారికంగా స్వీకరించారు. ఇది ఐచ్ఛికమే. ఇప్పటికీ హిందీ వ్యతిరేక రాష్ట్రమైన తమిళనాడులోని అన్ని కేంద్రాల్లో ఆలిండియా రేడియో అనే పిలుస్తున్నారు. ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16న మద్రాసు నుంచి ప్రారంభమయ్యాయి. స్వాతం త్య్రం నాటికి ఆరు రేడియో కేంద్రాలతో 11% దేశ జనాభాకే ప్రసారాలు అందగా నేడు 480 కేంద్రాలతో 99% జనాభాకు చేరుతున్నాయి.
షార్ట్ వేవ్, మీడియం వేవ్ ప్రసారాలకంటే మరింత స్వచ్ఛంగా 1977 నుంచి ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం కావడం ఆకాశవాణి చరిత్రలో ముఖ్యమైన మలుపు. 1990లో ప్రసారభారతి బిల్లుకు ఆమోదం లభించాక 1993 నుంచే వినోదం ప్రధానంగా, ప్రైవేటు రేడియో కేంద్రాల స్థాపనకు ప్రభుత్వమే ఆహ్వానించడంతో, 2001లో తొలి ప్రైవేటు ఎఫ్ఎం రేడియో సిటీ బెంగళూర్ కేంద్రం తన ప్రసారాలు ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 107 నగరాల్లో 371 ప్రైవేటు ఎఫ్ఎం రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోల రాకతో ఆకాశవాణి ప్రభ క్రమంగా మసకబారసాగింది. ఆదాయం పడిపోయింది. దీనికితోడు తరచూ విధి విధానాలను మారుస్తూ ప్రసారభారతి కార్పొరేషన్ ఆధిపత్య ధోరణిలో, అవగాహన లేకుండా వ్యవహరించడంతో ఆకాశవాణి, దూరదర్శన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. గతంలో తమ మేధస్సుతో ఎందరో ఉన్నతాధికారులు, కేంద్ర సంచాలకులు, కార్యక్రమ నిర్వాహకులు ఆకాశవాణిని ఉన్నత శిఖరాలకు చేర్చారు. కానీ, ప్రసారభారతి కార్పొరేట్ కల్చర్ను చొప్పిస్తూ ఆకాశవాణి విలువలకు స్వస్తి చెప్తున్నది.
1950-90 వరకు ఆకాశవాణిది స్వర్ణయుగం అని చెప్తారు. ఈ కాలంలో యావత్ భారత జనజీవనాన్ని రేడియో అత్యంత ప్రభావితం చేసింది. మన జాతి సంస్కృతి సంప్రదాయాలను నిలుపడంలో, కళలు మొదలు కరెంట్ అఫైర్స్ వరకు ఆకాశవాణి పోషించిన పాత్ర మరపురానిది. మత ప్రసక్తి లేకుండా ఏ పండుగ వచ్చినా ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసింది.
వార్తలకు అత్యంత ప్రామాణికత, ప్రాధాన్యం ఉండేది. మత కల్లోలాలు చెలరేగినపుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు ఆకాశవాణి వార్తలపైనే ఆధారపడేవారు. న్యూస్ రీడర్లకు, ఎనౌన్సర్లకు ఆ రోజుల్లో సినీతారల్లాంటి పేరు ప్రఖ్యాతులుండేవి. శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే వ్యాఖ్యాతలు ఉండేవారు.
కర్షకుల కార్యక్రమానికి కళాత్మకత అద్ది కమర్షియల్ వాల్యూ తెచ్చిన ఖ్యాతి చిన్నక్క (రతన్ ప్రసాద్), ఏకాంబరం (వి.సత్యనారాయణ)లకు దక్కుతుంది. సాహిత్యానికి సంబంధించి ఎన్నో వైవిధ్యభరిత కార్యక్రమాలను ప్రసారం చేసిన ఘనత ఆకాశవాణిది. బాలానందం, బాలవినోదం కార్యక్రమాలు పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకున్నవి. ‘రేడి యో అక్కయ్య, అన్నయ్య’లుగా కామేశ్వరి, రాఘవరావు ప్రసిద్ధులు. పి.సుశీల గాత్రాన్ని రేడియోలో వినే పెండ్యాల సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆకాశవాణి క్రమంగా శ్రోతలకు దూరమైపోవడం ఓ విషాదం. ప్రైవేటు రేడియోల శైలిని ఆకాశవాణి అనుకరించటం శ్రోతలకు నచ్చడం లేదు. అమ్మ అమ్మలాగే హుందాగా ఉండాలికానీ టీనేజీ అమ్మాయిలాగా గంతులు వేయద్దనేది శ్రోతల అభిమతం. వివిధ పట్టణాల్లో ఉన్న స్టేషన్లను క్రమంగా మూసివేయటానికి అడుగులువేయటం అటు ఉద్యోగులలో, ఇటు శ్రోతల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఆకాశవాణి సంక్షోభంలో పడిపోయింది. హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖ మొదలైన ప్రధాన కేంద్రాలు మినహా మిగతా స్థానిక ఎఫ్ఎం రేడియో కేంద్రాలను ఏప్రిల్ నుంచి మూసివేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆకాశవాణి మన జాతి జీవనాడి. దానిని కాపాడుకోవాలి.
గత ఐదేండ్ల నుంచి ఆకాశవాణిపై కేంద్రప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి, క్రమక్రమంగా విక్రయించాలనే ఆలోచనలు చేయడం, ఆలిండియా రేడియో మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ప్రకటనలు తెచ్చుకోండి, మీ ఆదాయం మీరే సమకూర్చుకోండి వంటి ఆదేశాలతో రేడియో కార్యక్రమాల ప్రమాణాలు తగ్గాయి.
‘మన్ కీ బాత్’ పేరుతో ప్రధాని మోదీ ఇప్పటివరకూ 82 ఎపిసోడ్లు పూర్తిచేశారు. మోదీ ఉపయోగించుకున్నంతగా ఏ ప్రధానీ రేడియోను ఉపయోగించుకోలేదు. ఒకవైపు ఆకాశవాణి ద్వారా తన వాణిని వినిపిస్తూనే మరోవైపు ఆకాశవాణి మూలాలకే విఘాతం కలిగించే చర్యలు చేపట్టడం వారి ద్విస్వభావ వైఖరికి నిదర్శనం. అమెరికా మొదలు జపాన్ వరకు ప్రపంచంలో ఏ దేశమైనా తమ రేడియో ఉనికిని కాపాడుతుంటే భారత సర్కారు అధఃపాతాళానికి తొక్కేస్తుండటం శోచనీయం. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు భారతీయులను ఏకసూత్రంతో అనుసంధానించే శబ్దవేది ఆకాశవాణి ఇకపై మూగవాణి కాకూడదు. దేశప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమించి ఈ సంక్షోభాన్ని ఆపాలి.
ఉషశ్రీగా చిరపరిచితులైన పురాణపండ సూర్యప్రకాశ దీక్షితుల పురాణ శ్రవణం రేడియోను ఉత్తుంగశిఖరంపై నిలబెట్టింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన వ్యాఖ్యానం వినటానికి శ్రోతలు రేడియో చుట్టూ చేరిపోయేవారు. ఇంట్లో రేడియో సెట్ ఉండటం అప్పట్లో ఒక ప్రిస్టేజి సింబల్. మహాకవి శ్రీశ్రీ, సీనియర్ నటుడు జగ్గయ్య ఒకప్పుడు వార్తలు చదివిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు.
(వ్యాసకర్త: సాహిత్య,చరిత్ర , విశ్లేషకుడు)
(ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం)
డాక్టర్.వి.వి.
రామారావు