దేశంలో రాజకీయ వాతావరణం వేగంగా మారిపోతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో వచ్చిన సమీకరణలు ప్రజల కంటే పార్టీల అవసరాల కోసమే ఎక్కువగా జరిగాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో సాధించిన ప్రగతి ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పులను ఆశించిన స్థాయిలో తీసుకురాలేదని మేధావుల అభిప్రాయం. ఇదే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తపరిచారు. ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనని, వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు జరగాలన్నది ఆయన అభిప్రాయం. ఈ నేపథ్యంలో కొత్త జాతీయ పార్టీ సాధ్యాసాధ్యాలు, సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చిద్దాం.
భారతదేశ సామాజిక స్వభావం సర్వ మత సహనం, సామరస్యత, త్యాగం, నిస్వార్థం పునాదులుగా అభివృద్ధి చెందింది. ఇది పునాదిగా భారత జాతి ఒక్కటిగా నిర్మితమైంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త బట్టమూర్ అభిప్రాయం ప్రకారం ప్రతి పౌరుడు ప్రభుత్వ నిర్ణయాల్లో, రాజకీయ ప్రక్రియల్లో పాల్గొనే అవకాశం కలిగి ఉండాలి. కానీ మన ప్రజాస్వామ్యాన్ని గమనిస్తే ఎన్నికల వరకే పౌరులకు గౌరవం దక్కుతున్నది కానీ ప్రభుత్వ నిర్ణయాల్లో వారికి పాత్ర లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వ నిర్ణయాల్లో ప్రాంతీయ అవసరాలను పరిగణ నలోకి తీసుకోవటం లేదని, ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలకు విలువనివ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన నేతృత్వంలో రూపుదిద్దుకునే నూతన జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలతోపాటు ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గించడం, శ్రామిక వర్గం అంతస్తును పెంచడం లాంటి విషయాలను అజెండాగా చేర్చుకుంటే బాగుంటుంది.
ఈ దేశాన్ని ఎక్కువకాలం పాలించిన కాం గ్రెస్, బీజేపీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లోని అసమానతలను ప్రజానీకం ఆశించిన మేర తగ్గించలేకపోయాయి. అందుకే దేశంలో నేడు నిరుద్యోగం, వలసలు, అవిద్య, అనారోగ్యం, అధిక జనాభా, అసహనం, కుల, మత, ప్రాంతీయ తత్వాలు, సామాజిక హింస లాంటి సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. మన దేశం కన్నా చిన్నవైన దేశాలు భౌతిక వనరులు లేనప్పటికీ ఎంతో ప్రగతి సాధించాయి. కానీ మనం మాత్రం ఆశించినంత అభివృద్ధిని ఎందుకు సాధించలేదని సగటు పౌరుడు ఈ వజ్రోత్సవాల వేళ ఆవేదన చెందుతున్నారు.
దేశ రాజకీయవ్యవస్థ, పరిపాలన విధానం బలమైన కేంద్రం-బలమైన రాష్ర్టాల స్ఫూర్తితో కాకుండా, బలమైన కేంద్రం-బలహీన రాష్ర్టాలుగా సాగుతున్నదని కేసీఆర్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాల అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పక ఉండాలని, కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించటం ఎంతమాత్రమూ సరికాదని భావిస్తున్నారు.
తాను ప్రారంభించబోయే జాతీయ పార్టీ దేశ ప్రజల కలయికగా ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. గత 75 ఏండ్లలో మారకుండా మూస ధోరణిలో సాగిన దేశ పాలన విధానా న్ని మార్చి దేశ ప్రజల జీవనంలో గుణాత్మక మార్పు తీసుకురావాలన్నది కేసీఆర్ ముఖ్య లక్ష్యంగా గోచరిస్తున్నది. మరో స్వాతంత్య్ర విప్లవానికి కేసీఆర్ నాంది పలుకుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ఇంతటి బృహత్తర జాతీయ ఆకాంక్షను సాకారం చేసే సిద్ధాంతం, కార్యాచరణ వ్యూహం తన వద్ద ఉన్నాయని ఆయన ప్రకటించారు. త్వరలోనే తన కార్యాచరణను ప్రారంభిస్తానని చెప్తున్నారు. తాను స్థాపించనున్న జాతీయ పార్టీ అజెండా, కార్యక్రమాలు, ప్రస్థానంపై ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉన్నది. అవి త్వరలోనే అందరికీ స్పష్టంగా అర్థమవుతాయి.
గత ఎనిమిదేండ్లలో తెలంగాణను వివిధ రంగాల్లో అగ్రగ్రామిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారు. అద్భుతమైన పరిపాలన విధానంతో గత నాలుగేండ్లలో నీతి ఆయోగ్, ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రుల ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని జాతీయపార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నది. ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం. నిన్నటి వరకు బలంగా ఉన్న ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు నేడు బలహీనమైపోయారు. కొన్ని పార్టీల వ్యవస్థాపక నేతలు కాలం జేశారు. మరికొందరిని వయోభారం వేధిస్తున్నది.
ఇప్పటివరకూ ప్రాంతీయ పార్టీలు యూపీఏ, ఎన్డీయే కూటముల కింద విడిపోయి తమ మనుగడ కోసం పాకులాడాయి. పాలనలో గుణాత్మక మార్పును తేలేకపోయాయి. దీనిని గుర్తించే, ఈ సమస్యను అధిగమించడానికి, సమాఖ్య స్ఫూర్తితో జాతీయపార్టీ రూపకల్పన మొదలుపెట్టారు కేసీఆర్.
ఈ తరం అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల్లో రాజకీయ వివేచన, పద్నాలుగేండ్ల ఉద్యమ అనుభవం, ప్రజాప్రతినిధిగా దాదా పు నలభై ఏండ్ల అనుభవం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం కలిగిన ఏకైక నేత కేసీఆర్. చురుకుగా వ్యవహరించే స్వభావం, కొత్త ఆలోచనలు కలిగిన డైనమిక్ లీడర్ కేసీఆర్. ఆయన నాయకత్వంతో ఏర్పడే జాతీయ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఇందుకోసం ఆయన తీవ్ర కృషి చేస్తున్నారు. విశ్రాంత సివిల్ సర్వెంట్లను, సైనికాధికారులను, పాత్రికేయులను, మేధావులను, సామాజిక కార్యకర్తలను కలిసి వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. వారిని తన జాతీయ పార్టీలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నారు.
జాతీయ స్థాయి రైతు సంఘాల నాయకులు, ప్రవాస భారతీయులు, శంకర్ సింఘ్ వాఘేలా లాంటి సీనియర్ రాజకీయ నాయకులు కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపనకు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ ప్రణాళికలు విజయవంతమై, ఆయన నాయకత్వంలో దేశం గుణాత్మక మార్పును చూస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: ఎమిరిటస్ ప్రొఫెసర్, ఓయూ)
గట్టు సత్యనారాయణ
98666 78087