సిద్ధ ఛాయా చిత్రకారులు భరత్ భూషణ్ రెండోసారి క్యాన్సర్కు చికిత్స పొంది తిరిగి కెమెరా చేతబడుతారనే అనుకున్నా, ఆ కల నెరవేరలేదు. భావి తరాలకు ఆయన తన కళను ఒక సంపదగా ఇచ్చి, తాను శాశ్వత నిద్రలోకి జారిపోయారు.
భరత్ భూషణ్ అకాల మరణం ఒక సరికొత్త చరిత్రకు నాందిగా మారుతుందనే నా నమ్మకం. తాను కన్ను మూసింది మొదలు ఆయన గురించి ప్రపంచం మేలుకోవడం ఖాయం అంటాను నేను. ఎందుకంటే భరత్ భూషణ్ కృషి భావి తరాలకు సంపద. కాబట్టే ఆయనకు మరణం లేదు. ఛాయచిత్ర ప్రపంచంలో ఆయన ప్రభావం విస్తారం. చాలా మంది ఫొటోగ్రాఫర్ల మాదిరిగా పత్రికల్లో వార్తలకు శోభనిచ్చే చిత్రాలను తీయడం కాకుండా, చిత్రం దానంతటదే విశేషంగా వర్ధిల్లే వస్తు శైలిని ఆయన అనుసరించారు. తాను చిత్రిస్తున్న గోడమీది నినాదం ఒక చరిత్ర అని అప్పుడే గ్రహించారు. తాను చూస్తున్న తెలంగాణ పెద్ద దర్వాజా, మూసి ఉన్న తలుపులను… ఒక సంక్షోభ వర్తమానంగా స్వీకరించారు.
అలాగే తాగునీరు, సాగునీరుకు కటకటలాడుతున్న తెలంగాణ ప్రజలు కాగితపు బతుకమ్మలతో పండుగ చేసుకోవడం, అందులోని ఆశ, విశ్వాసాన్ని ఆయన నాడే జాగురూకతతో గ్రహించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం అనివార్యం అన్న ధోరణితోనే ఆయన ముందుకు సాగారు. ఫలితమే వారి ఛాయా చిత్ర సర్వస్వం విస్తారంగా మిగిలింది. ఆ ఇగురంతోనే వారి జీవితకాల కృషిని గ్రంథస్థం చేయడం, ప్రదర్శనలు నిర్వహించటం, మ్యూజియం ఏర్పాటు చేయడం, ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ఏటా ప్రకటించడం ఒక చారిత్రక అవసరం.
ఆయన స్థానికుడిగా అనిపిస్తుందిగానీ కాదు, తాను విశ్వజనీనం. ‘నా దేశమే నా ప్రపంచం’ అన్న సుప్రసిద్ధ భారతీయ ఛాయా చిత్రకారుడు రఘురాయ్ మాదిరి మన భరత్ భూషణ్కు ‘తెలుగు నేలే భారతం’. తెలంగాణయే ప్రపంచం. అంతేకాదు, ఫొటోగ్రఫీకి దేశంలో సిగ్నేచర్ వాల్యూ తెచ్చిన రఘు రాయ్ మాదిరే, తెలుగు నాట ఎంతో పాపులర్ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్.
మోడ్రన్ ఫొటోగ్రఫీకి ఆద్యుడిగా భావించే ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్ బ్రస్సెన్ శైలి నుంచి స్ఫూర్తి పొందారు భరత్ భూషణ్. ఆయనవలె తానూ ఎక్కడ చరిత్ర రూపు కడుతుంటే అక్కడ వాలేవారు. రేపటి చరిత్ర కానున్న వస్తువును ముందే పసిగట్టి చిత్రీకరించేవారు. అలాగే వారి వలె ఈయనా చిత్రకారులు.
ఓరుగల్లు బిడ్డ, పద్మశాలి. తెలంగాణకు ఒక రకంగా కాకతీయ తోరణం భరత్ భూషణ్. తెలంగాణకు సంబంధించి ఆయన రెండు విధాలా పనిచేశారు. కాళోజీ ‘నా గొడవ’ మాదిరి తక్షణం పనిచేశారు. సురవరం ప్రతాపరెడ్డి మాదిరి దీర్ఘకాలిక ప్రభావం ఉండేలా చరిత్రను, వారసత్వాన్ని నలుదిక్కులా చాటారు. బతుకమ్మ, ముగ్గు లు, తలుపులు మొదలు వారి రూపచిత్రాల దాకా వాటి ని మనం గనుక పరిశీలిస్తే తెలుగు సమాజం పరిణామ క్రమంలో సామాన్యుడి జీవనమెట్టిదో గోచరిస్తుంది.
చిత్రమేమిటంటే రాష్ర్టానికి అన్నీ అమరిన తర్వాత ఆయన మరణించడం విషాదం. ఇప్పటిదాకా ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరించిన ప్రభుత్వం, మిత్రులు ఇక ఆయన వారసత్వ సంపదపై దృష్టి పెట్టాలి. దాన్ని చిరస్మరణీయం చేయాలి.
కందుకూరి రమేష్ బాబు, 99480 77893
(వ్యాసకర్త: ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఫొటోగ్రాఫర్)