తెలంగాణ అనే పచ్చటి చెట్టును డ్రగ్స్ చీడ నుంచి కాపాడుకోవటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యుద్ధం స్ఫూర్తివంతమైనది. ప్రగతి పథంలో సాగుతున్న రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు అనే పెనుభూతం ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నది. దానిపై నిర్లిప్తత చూపితే అది రాష్ట్ర యువతపై మత్తుమందు చల్లి వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఈ దీర్ఘకాలిక ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. ఏకంగా వెయ్యిమంది సుశిక్షితులైన సిబ్బందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట కూడా వినపడకుండా ఉక్కుపాదం మోపాలని ఆదేశించడాన్ని బట్టి ఈ సమస్య పట్ల ముఖ్యమంత్రి ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుస్తున్నది. ఇప్పటికే విత్తనాల కల్తీపై, పండ్లను రసాయనాలతో మగ్గపెట్టటంపై, పేకాట క్లబ్బులపై కొరడా ఝుళిపించి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించింది రాష్ట్రప్రభుత్వం. ఇప్పుడు మత్తుపదార్థాలపైనా యుద్ధానికి దిగటం ద్వారా ‘ఆరోగ్య తెలంగాణ’ కోసం ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో ప్రకటించినట్టయ్యింది.
డ్రగ్స్ దందాలో కీలక నేరస్థుడు, అంతర్జాతీయ స్మగ్లర్ టోనీని ముంబైలో అరెస్టు చేయటం తెలంగాణ పోలీసు విభాగం సామర్థ్యానికి నిదర్శనం. స్థిరాస్తి వ్యాపారులు, సినీరంగానికి చెందిన వాళ్లు టోనీ నుంచి కొకైన్ కొంటున్నారని వెల్లడైంది. ఇప్పటి వరకు మాదకద్రవ్యాల సరఫరాదారులపైనే నిఘా పెట్టిన పోలీసులు ఇక మీదట వాటి వాడకందారుల మీద కూడా దృష్టి పెట్టి కేసులు నమోదు చేయాలనుకోవటం మంచి నిర్ణయం. వేల కోట్ల రూపాయలతో కూడిన డ్రగ్స్ దందా చేస్తున్నవాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ దర్యాప్తు సంస్థల కన్నుగప్పుతున్నారు. వారి తలదన్నే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దర్యాప్తుసంస్థలు నేరస్థుల మీద పైచేయి సాధించాలి. గంజాయి వంటి మత్తుపదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడినప్పుడు వాటిని కాల్చివేయటానికి నిబంధనల పేరిట చాలా సమయం తీసుకోవటం, ఈలోపు అవి పక్కదారి పట్టటం వంటి సమస్యలున్నాయి. ఈ లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రపంచ దేశాల ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తర్వాత అతిపెద్దది మాదకద్రవ్యాలేనని ఐక్యరాజ్యసమితి గతంలో ప్రకటించింది. దర్యాప్తుసంస్థలు సమన్వయంతో, ఏకోన్ముఖంగా కదం తొక్కితేనే ఈ మహమ్మారి పీచమణచటం సాధ్యమవుతుంది. సమన్వయం లేకపోవటమే నేరస్థుల ముఠాలకు వరంగా మారుతున్నది. దేశంలో డ్రగ్స్ రక్కసిని నిర్మూలించే ప్రధాన బాధ్యత కేంద్రంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోపైన ఉంది. కానీ ఆ సంస్థకు తగినంత సిబ్బంది, తగినన్ని కార్యాలయాలు కూడా లేని దుస్థితి.. ఈ సమస్యపై కేంద్రం నిర్లిప్త ధోరణిని పట్టిచూపుతున్నది. వారు వీరు అని తేడా లేకుండా డ్రగ్స్ భూతంపై మహాయుద్ధాన్ని ప్రకటించిన తెలంగాణ నుంచి కేంద్రం స్ఫూర్తి పొందాలి. రాష్ర్టాలను సమన్వయపర్చుకుంటూ యువత మత్తు వదిలించే పోరాటానికి దేశవ్యాప్తంగా నాంది పలుకాలి.