మునిమాణిక్యం కథల్లో భార్య ‘కాంతం’ కాగా, ఈయన కథల్లో భార్య పేరు ‘కనకం’. పెండ్యాల, వెల్దుర్తి, ఇటిక్యాల వంటి వాళ్లందరూ కూడా 1940వ దశకంలో దాంపత్య ప్రేమను చిత్రిస్తూ కథలు రాశారు. నెల్లూరి కేశవస్వామి ముఖ్యంగా హైదరాబాద్లోని పాతబస్తీలో ధనిక కుటుంబాల్లో హిందూ-ముస్లింల మధ్యనున్న అనుబంధాలు, స్నేహ సంబంధాలను చిత్రించాడు. ఆయన 1948లో రాసిన ‘యుగాంతం’ కథలో నైజాం భారత యూనియన్లో చేరటం, రజాకార్లు కొందరు పాకిస్థాన్కు తరలిపోవటం వంటి వృత్తాంతాలను చిత్రించాడు.
1940లో ‘కమ్మతెమ్మెరలు’ అనే కథా సంకలనం వచ్చింది. అందులో చెరుకుపల్లి రఘోత్తమరావు, హరికృష్ణారావు సోదరులు రాసిన కథల్లో ఆనాటి కానిగీ బడులు, దేవాలయాల్లో ఉండే పరిస్థితులు చిత్రింపబడినాయి. ఆ కాలంలో అక్షరాస్యత తక్కువ ఉన్నా, చదివేవారు తక్కువ ఉన్నా రచయితలు చాలా ఉత్సాహంతో కథా సంపుటాలను, కథా సంకలనాలను ప్రచురించారు.
1950వ దశకంలో కవి రాజమూర్తి, డి.రామలింగం, హీరాలాల్ మోరియా, సురమౌళి, గూడూరి సీతారాం, యశోదారెడ్డి, జి.రాములు, ఊటకూరి రంగారావు వంటి ఎందరో రచయితలు తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజాజీవితాన్ని చిత్రిస్తూ చాలా కథలు రాశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత.. తెలంగాణలో సాహిత్యం అంతగా వికసించలేదని కొందరు అంటారు. అంటే ఇక్కడి సాహిత్యానికి గుర్తింపు రాలేదు. ఇక్కడి రచనల్లోని భాష వల్లనో, వాతావరణ చిత్రణ వల్లనో పత్రికలు ఇక్కడి రచనలను వేసుకోలేదు. పత్రికలు ఆదరించకున్నా ఎంతోమంది తెలంగాణ కథా రచయితలు కథలు రాశారు.
1960-70 దశకంలో నిఖిలేశ్వర్, చెరబండరాజు, దేవరాజు మహారాజు, ఉప్పల నరసింహం, బోయ జంగయ్య, ఆడెపు లక్ష్మీపతి, కె.వి.నరేందర్, పులుగు శ్రీనివాస్, బి.ఎస్. రాములు, కాలువ మల్లయ్య మొదలైన వారెందరో కథలు రాశారు. తర్వాత 1990వ దశకంలో వేముల ఎల్లయ్య, జూపాక సుభద్ర, గోగు శ్యామల, పెద్దింటి అశోక్కుమార్, జాజుల గౌరి, ముదిగంటి సుజాతారెడ్డి, జాతశ్రీ, మేరెడ్డి యాదగిరిరెడ్డి, దిలావర్, రామా చంద్రమౌళి, జూకంటి జగన్నాథం మొదలైన వారెందరో కథలు రాశారు, రాస్తున్నారు. ముస్లింల జీవన పరిస్థితులను వెల్లడించే లక్ష్యంతో అఫ్సర్, స్కైబాబా, షాజహానా, యాకూబ్ తదితర రచయితలు కథలు, కవితలు రాశారు.
ప్రపంచీకరణ తెచ్చిపెట్టిన మార్పులు, సమస్యలను, ‘డయస్పోరా’ను జీర్ణించుకొని తెలంగాణ రచయితలు సమకాలిక సమస్యలను చిత్రిస్తూ ఎప్పటికప్పుడు కథలు రాస్తున్నారు. అల్లం రాజయ్య, రఘోత్తంరెడ్డి, పి.చంద్ వంటి వారు విప్లవోద్యమం నేపథ్యంగా అనేక కథలు రాశారు. ఇప్పటికీ రాస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలోనూ ఎంతోమంది పోరాటాన్ని ప్రతిబింబించే కథలు రాశారు.
ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను చిత్రిస్తూ తాడిగిరి పోతరాజు 1970ల్లో ‘కెటిల్’ అనే కథా సంపుటిని రూపొందించాడు. ఈ విధంగా తెలంగాణ కథారచయితలు ఏనాటికానాటి పరిస్థితులను చిత్రిస్తూ కథలు రాశారు. తెలంగాణకు ఇంతటి ప్రాచీనమైన, విశాలమైన కథాసాహిత్యం ఉండగా తెలంగాణలో ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం) కాలం నాటికి కథలే లేవని, విరసం రోజుల్లో 1970 నుంచే తెలంగాణ కథాసాహిత్యం ఆరంభమైందని సాహిత్య లోకంలో ప్రచారం జరిగింది. తెలంగాణ అస్తిత్వ పోరాట కాలంలో సంగిశెట్టి శ్రీనివాస్, ముదిగంటి సుజాతారెడ్డి వంటి ఎంతోమంది సాహితీ పరిశోధకులు తవ్వి తీసి ‘తెలంగాణ తొలితరం కథలు’ ప్రచురించిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 19వ శతాబ్దం చివరి దశకం నుంచే తెలంగాణలో కథారచన ఆరంభమైందని, ఎంతో కథా సాహిత్యం వచ్చిందని దీనిద్వారా ప్రపంచానికి తెలిసింది.
ఇంగ్లీషులో ఉన్న ‘నావెల్లా’, ’నావెల్’ అనే సాహితీ ప్రక్రియనే మనం తెలుగులోకి ‘నవల’ అని తీసుకున్నాం. నవల అనే పదం ఇంతకుముందే తెలుగులో ‘నూతనత్వం’ అనే అర్థంలో వాడుకలో ఉంది. అంతేగాక అచ్చ తెనుగులో ‘నవలా’ స్త్రీ అనే అర్థంతో ఉంది. కాబట్టి ఇంగ్లీషులో ఉన్న ‘నవల’ అనే పదం తెలుగులో సులభంగా ఒదిగిపోయింది. నవలను గుజరాతీ, మరాఠీ, కన్నడంలో ‘కావంబరి’ అని, హిందీ, బెంగాలీ భాషల్లో ‘ఉపన్యాస్’ అనీ పిలుస్తారు.
తెలంగాణలో మొట్టమొదటి నవలగా 1866లో తడకమళ్ల వెంకటకృష్ణారావు రచించిన ‘కంబు కందర చరిత్ర’ను పేర్కొంటారు. 1879లో ఆయనే రచించిన ‘తెలుగు వెలుగు’, ‘ముగుద’లకు కూడా మొదటి నవలలన్న పేరుంది. ఈ రెండింటిలోనూ కథ కల్పితమే. ఇవి కాశీ మజిలీ కథల లాంటివి. ఇటువంటి రచనలు ఆ రోజుల్లో కుప్పలు తెప్పలుగా రాయబడినవి. తాటాకు గ్రంథాలయాలలో అనేకం ఉన్నా యి. కొన్ని మాత్రం అచ్చయి పాఠకుల ఆదరణను సంపాదించాయి. వీటిని ‘నవల’ అనలేము. నవల లక్షణాలు వీటికి పట్టవు.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606