రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు ఎంతో ముఖ్యం. అవి ఎంత విరివిగా ఏర్పడితే ఆ రాష్ట్రం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. బెంగళూరు,ఢిల్లీ లాంటి ప్రాంతాలకే పరిమితమైన పరిశ్రమలు, ఇప్పుడు తెలంగాణకూ పరుగులు పెడుతున్నాయి.
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానంలో యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలే అందుకు కారణం. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కేటీఆర్ అనేక కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చారు. అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన ప్రసంగాలు, నూతన సంస్కరణల విధానాలు నచ్చి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉండి పరిశ్రమల ఏర్పాటులో ముందంజలో ఉన్నది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిశ్రమల కారిడార్గా మారుతున్నది. పరిశ్రమలు అంటే కేవలం బడా కార్పొరేట్ సంస్థలే కాకుండా.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటుచేసి వారికి అండగా ఉండేందుకు రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నది. ఒక్క హైదరాబాద్ కేంద్రంగా కాకుండా వరంగల్లో టెక్స్టైల్స్ పార్కు వంటి వాటిని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నది. అయితే పరిశ్రమలు ఏర్పడే సమయంలో ప్రభుత్వం పరిశ్రమ నెలకొల్పే స్థలం ప్రభుత్వానిదైతే సమస్య ఉండదు. కానీ ఒక్కోసారి కొద్దిమంది ప్రజల భాగస్వామ్యం, వారి సమ్మతితో అక్కడ పరిశ్రమల నిర్మాణం చేపట్టాల్సి వస్తున్నది. అప్పుడు ప్రజలు సహకరించాలి.
ఏ ప్రభుత్వమైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమనేది అసాధ్యం. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా పరిశ్రమలను ఏర్పాటుచేసి స్థానికులకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తాయి. నేడు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగాం గ్రామాల్లో జూట్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ పరిశ్రమతో సుమారు 5 వేల మందికి ఉపాధి లభిస్తుంది. భూమి కోల్పోయే బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ సైతం పరిశ్రమ కోసం భూమిని కోల్పోయేవారికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. అయినా కొందరు కావాలని అక్కడి రైతుల చేత నిరసనలు చేయించి రాజకీయ కుట్రలకు తెరలేపుతుండటం ఇక్కడి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నట్లుగానే భావించాలి.
ప్రతిపక్షాలు కుట్రపూరితంగా పరిశ్రమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎల్లారెడ్డి గడ్డ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. అటువంటి సమయంలో ప్రజలు, ఆయా గ్రామాల రైతులు పరిశ్రమలను స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. కానీ, ప్రతిపక్షాల కపట నాటకాల్లో పడి తరతరాలకు భవిష్యత్తును ఇచ్చే పరిశ్రమను అడ్డుకోవడమంటే మన ప్రగతిని మనం అడ్డుకోవడమే. అలా అని భూ బాధితుల ఆవేదనను తప్పుగా భావించడం లేదు. మీ సందేహాలు, మీ భరోసా కోసం ప్రభుత్వంతో స్పష్టమైన హామీ తీసుకొని సహకరిస్తే వేల మంది నిరుద్యోగుల తలరాత మారే అవకాశం ఉన్నది.
సంపత్ గడ్డం, 78933 03516
(వ్యాసకర్త: టీఆర్ఎస్వీ, దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)