‘కూరిమి గల దినములలో/ నేరములెన్నడును గలుగనేరవు మరి యా/ కూరిమి విరసంబైనను/ నేరములే తోచుచుండు నిక్కము సుమతీ’ అంటూ ఏనాడో స్నేహ సంబంధాల తీరును వివరించాడు సుమతి శతకకారుడు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత- గత ఏడేండ్లుగా- ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు ‘కూరిమి విరసింబైనను నేరములే తోచుచుండు’ అన్నట్టుగానే ఉన్నాయి. తాజాగా మన దేశ భూభాగంలో రహదారి వెడల్పు చేద్దామంటే నేపాల్ అభ్యంతరం చెప్పడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇటీవల ప్రధాని మోదీ ఉత్తరాఖండ్లోని ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ- ఆ రాష్ట్రంలోని లిపులేఖ్లో రహదారిని వెడల్పు చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే నేపాల్ ప్రభుత్వం వెంటనే అది తమ భూభాగం అంటూ అభ్యంతరం చెప్పింది. ఇరుగు పొరుగు దేశాలన్నాక సరిహద్దుపై భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. ఈ సరిహద్దు వివాదం దశాబ్దాల నాటినుంచి ఉన్నది. కానీ ఇప్పుడే జటిల సమస్యగా ఎందుకు ముందుకు వచ్చిందనేది ఆలోచించవలసిన విషయం.
పాకిస్థాన్కు మన దేశానికి మధ్య కొంత వైషమ్యం ఉన్నదీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇందుకు చారిత్రక కారణాలు, అనేక చేదు ఘట్టాలు సాక్ష్యంగా ఉన్నాయి. కానీ మిగతా దేశాలలో భారత్ వ్యతిరేకత ప్రబలడమేమిటి? కొన్నేండ్లుగా నేపాల్ మన దేశంతో తరచూ కయ్యానికి దిగుతున్నది. నేపాల్కు హిమాలయాలకు ఆవల ఉన్న చైనా మీదుగా ఎగుమతి దిగుమతులు చాలా కష్టం. భౌగోళికంగా మన దేశంతో విభేదాలు పెంచుకోవడం ఆ దేశానికే నష్టం. అయినా వైరం కొనసాగుతున్నది. భూటాన్తో కూడా గతంలో ఉన్నంత సామరస్యం లేదు. శ్రీలంకలో, మాల్దీవ్స్లో చైనా ప్రభావం పెరిగిపోయే కొద్దీ భారత వ్యతిరేకత బలపడుతున్నది. బలమైన చైనా ప్రభావం కాదనలేనిది. కానీ అమెరికా, యూరప్ దేశాల మద్దతు మనకే ఉన్నది. చైనాను, పొరుగు దేశాలను నిందించే కన్నా, గత ఏడేండ్లుగా మన వ్యవహారసరళిలో ఏదైనా లోపం ఉందా అనే అంతర్మథనానికి పాల్పడితే మంచిది.
దక్షిణాసియాలోని మన చుట్టూరా దేశాలతో మనకు దృఢమైన చారిత్రక సంబంధాలున్నాయి. భాషా సంస్కృతుల పరంగా చూస్తే, పాకిస్థాన్తో సహా మన పొరుగుదేశాలలోని ప్రజలు చైనా సమాజం కన్నా మనతోనే సులభంగా కలిసిపోగలరు. పాకిస్థాన్ ప్రభుత్వం మన దేశ సినిమాలను, టీవీ సీరియల్స్ను నిషేధిస్తే, అక్కడి ప్రజలు దొంగచాటుగా చూస్తారనేది బహిరంగ రహస్యం. ఈ సామాజిక సారూప్యాలను మనకు అనుకూలాంశాలుగా ఉపయోగించుకోవాలి. చైనా ఇచ్చిన అప్పుల మూలంగా దివాలా అంచున ఉన్న శ్రీలంక ఇప్పుడు మన దేశ సహాయాన్ని అర్థించడం లేదా! మన దేశం తలుచుకుంటే మృదువైన దౌత్యనీతితో దక్షిణాసియా అంతటినీ ప్రభావితం చేయవచ్చు. మన దేశం ఇప్పటికైనా అప్రమత్తం కావాలి.