హుజూరాబాద్ ఎన్నిక ఫలితం ఇలా ఎందుకున్నదో స్వయంగా కాంగ్రెస్ వారి మాటల్లోనే వెల్లడైంది. మనం ఇంకా వేరుగా విశ్లేషించాల్సిందేమీ లేదు. కాంగ్రెస్ అభ్యర్థికి మూడు వేల ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని, తక్కినవి ఎటుపోయాయని తమ నాయకత్వా న్ని సూటిగానే ప్రశ్నించారు. దానర్థం ఓట్లు ఎవరికి బదిలీ చేయించారని. స్వయంగా గెలవలేరు గనుక టీఆర్ఎస్ను ఓడించాలనే కక్షతో ఓట్లను బీజేపీకి బదిలీ చేసే గత కాలపు కథ కొనసాగిందన్నమాట. అయితే, వీటిని గమనిస్తూనే చర్చించాల్సిన విషయాలు కొన్నున్నాయి.
మన ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యతా సూచి (Oppositin Unity Index లేక OUI ) అనేది మొదటి నుంచీ ఉంది. అధికార పక్షం ఎంత ప్రజాదరణ గలది, బలమైనదైనా మొత్తం ఓట్లలో 50 శాతానికి పైగా లభించటం అరుదుగా జరుగుతూ వస్తున్న విషయం. తన జీవిత కాలంలో నెహ్రూకు సైతం అది సాధ్యం కాలేదు. అందుకు కారణం.. తక్కిన ఓట్లు వేర్వేరు పార్టీల మధ్య, సిద్ధాంతాలు, కులాలు, మతాలు, వ్యక్తుల వంటి కారణాల వల్ల చీలిపోతాయి. ఏవైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఇవి తగినంత మేర ఏకమైతే మాత్రమే ఆ బలమైన, ప్రజాదరణ గల అధికార పక్షాన్ని ఓడించగలవు. అయితే ప్రత్యేక పరిస్థితులన్నవి అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. తక్కిన సమయాల్లో అధికార పక్షానికి నష్టం ఉండదు. ఇటువంటి పరిస్థితులు, నెహ్రూ, ఇందిర, రాజీవ్గాంధీ నుంచి నరేంద్ర మోదీ వరకు అందరూ ఎదుర్కొన్న వారే.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తాము ఓడినా, తాము గాక చెప్పుకోదగిన ప్రతిపక్షమేదీ మరొకటి లేదు. కాని వారు పాఠాలు నేర్చుకొని 2019 నాటికైనా బలం పుంజుకోలేదు. ఆ తదనంతరం కూడా బీజేపీ బలహీనంగానే మిగిలిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను, మత తతా న్ని రెచ్చగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా, తమ కేంద్రనాయకత్వం ఎంత మద్దతుగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని బలపడవలసింది. కానీ 2019 తర్వాత కూడా అటువంటిదేమీ జరుగలేదు. వివిధ స్వీయవైఫల్యాల వల్ల పూర్తిగా నిర్వీర్యమైంది. ఆ స్థితి ఆ పార్టీ దిగువ శ్రేణులకు, అభిమానులకు ఆందోళనకరంగా తయారైంది. కాని కాంగ్రెస్ నాయకులకు తమ కేంద్ర నాయకత్వం సమర్థతపట్ల, తమ భవిష్యత్తుపట్ల ఆశలు సన్నగిల్లటం కొంతకాలం క్రితమే మొదలైంది. కాంగ్రెస్ సిద్ధాంతమనే కట్టుబడి దాదాపు అంతర్ధానమైంది. ఇక మిగిలింది.. ఏదో ఒక విధం గా, ఎక్కడో ఒక చోట అధికారం, సంపాదనలు.
2014, 2019ల్లో వరుసగా విఫలమైన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పు డు ప్రత్యేక పరిస్థితిలో ఉంది. 2023 ఎన్నికలనాటికైనా స్వయంగా నిలువగలమనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన ఆ పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ను నిలువరించేందుకు ఏకైక ఆధారంగా బీజేపీ కనిపిస్తున్నది. తెరవెనుక నుంచి బీజేపీకి దాసోహమనటం అన్న మాట! స్వప్రయోజనాలకోసం, టీఆర్ఎస్ను నిలువరించేందుకూ తమ నిర్వీర్యతతో అట్లా దాసోహమనక గత్యంతరం లేదని వారికి 2019 నాటికే అర్థమైనట్లున్నది. కనుకనే ఆ ప్రక్రియను నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లోక్సభ, దుబ్బాక అసెంబ్లీలతో ఆరంభించి ఇప్పుడు హుజూరాబాద్కు పొడిగించారు.
ప్రతిపక్ష ‘ఐక్యతా సూచి’కి, లొంగుబాటు ఓట్లబదిలీ రాజకీయానికి తేడా ఉంది. మొదటి దానిలో వివిధ ప్రతిపక్షాలు ఎవరి ప్రయోజనాల కోసం వారు, తమ ఉనికి కాపాడుకుంటూ, దాన్నింకా బలోపేతం చేసుకునేందుకు పరస్పర అవగాహనతో ఒక ఒప్పందానికి వస్తారు. అది ప్రజాస్వామికమైన పద్ధతి. బహిరంగంగా జరిగేది. కానీ తెలంగాణలో జరుగుతున్నదంతా ఇందుకు విరుద్ధం. కాంగ్రెస్ సిద్ధాంతాలు, పార్టీ ప్రయోజనాలు గాలికిపోతాయి. కొందరు నేతల వ్యక్తిగత లాభాలే ముందుకు వస్తాయి. ప్రజాస్వామికత, పారదర్శకత ఏమీ లేక అంతా తెరవెనుక జరుగుతుంది. కేంద్ర నాయకత్వానికి తెలిసినా, తన అసమర్థత వల్ల చేష్టలుడిగి పోతుంది. ఈ విధమైన వ్యవహారాలన్నీ 2023 ఎన్నికల నాటికి ఇంకా ముమ్మరమైతే ఆశ్చర్యపడవలసింది ఉండదు. అట్లా జరగకూడదంటే.. కాంగ్రెస్లో స్ఫూర్తి గలవారు, దిగువశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఈ తరహా లొంగుబాటు నాయకులపై తిరుగుబాటు చేయాలి.
టీఆర్ఎస్ విషయానికి వస్తే.. 2019 అనంతర కాలపు ఈ పరిణామాలు ఇప్పటికే స్పష్టమైనందున, తన అవగాహనను, వ్యూహాన్ని, కార్యాచరణను తగిన విధంగా మార్చుకోవలసి ఉంటుంది. ఇది ఒక స్థాయిలో రాజకీయంగా, మరొక స్థాయిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల విషయమై జరగాలి. ప్రజలతో సంబంధాలతో పరిపాలన, దానితో పాటు ముఖాముఖి ప్రత్యక్ష సంబంధం అనే రెండూ వస్తాయి.
టంకశాల అశోక్