బీజేపీ దళిత వ్యతిరేకిగా తన వైఖరి కొనసాగింపుగానే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత అంశాన్ని విస్మరిస్తున్నది. ‘వర్గీకరణ’ను ఎన్నికల హామీగా మాత్రమే మిగిల్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ ఏడేండ్లయినా ఆ హామీని అమలుచేయలేదు. ఎస్సీ వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపి ఏడేండ్లు అయినప్పటికీ వర్గీకరణ అంశాన్ని కేంద్రం ఇంకా పరిశీలించకపోవడం శోచనీయం.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలోనే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తెస్తాయి. ఆపై దానిపై చర్చే ఉండదు. కొన్ని సాంకేతిక సమస్యలను ప్రస్తావిస్తూ ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పటినుంచి ప్రతి ఎన్నికల్లోను వర్గీకరణ అంశం ఓట్ల రాజకీయంగా మారింది. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకుండా గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలు మాదిగలను మోసం చేస్తున్నాయి. ఎస్సీ కులాల మధ్య మరింత దూరం పెరగడానికి ఆజ్యం పోస్తున్నాయి. ఎస్సీల ఉద్యమ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ఫలాలు జనాభా దామాషా ప్రకారం పొందుతున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ అంశం మళ్లీ మొదటికి వచ్చింది.
రాష్ట్రంలో మాదిగల న్యాయమైన డిమాండ్ను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్ 29న శాసనసభలో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అప్పటినుంచి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ పట్ల తమ సానుకూలతను ప్రదర్శిస్తూనే ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసినప్పుడు అందులో కేసీఆర్ సభ్యులు. రిజర్వేషన్లను జనాభా ప్రతిపాదికన పంపిణీ చేయాలని, అప్పుడే అందరికీ సమన్యా యం జరుగుతుందని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఆ తర్వాత కాలంలో కేసీఆర్, నాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 2016 మే 10న ప్రధాని మోదీని కలిసి ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టం చేయాలని కోరా రు. త్వరగా పరిష్కరించాలని కేంద్రానికి అనేకమార్లు లేఖలు కూడా రాశారు. వర్గీకరణకు నాయకత్వం వహిం చి, సాధించి చూపిస్తానని అసెంబ్లీలో ప్రకటించి కేసీఆర్ మాదిగలకు భరోసా ఇచ్చారు
తర్వాత కాలంలో అనేకమార్లు కేంద్రానికి విన్నవించినా ఫలితం లేదు. హైదరాబాద్లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్కు, మెట్రోరైల్ ప్రారంభానికి వచ్చిన సందర్భంలో కూడా అఖిలపక్షానికి సమయం అడిగితే మోదీ కుదరదని చెప్పారు. వర్గీకరణను చేస్తామని గల్లీ నాయకులు, చేయబోమని ఢిల్లీ నేతలు మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీన్నిబట్టి వర్గీకరణ పట్ల బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిదో యావత్ సమాజానికి అవగతమవుతున్నది.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటే టీఆర్ఎస్ మాత్రమే వర్గీకరణ పట్ల చిత్తశుద్ధిని చాటుకొంటూ సానుకూలతను కొనసాగిస్తున్నది. సీఎం కేసీఆర్ సందర్భానుసారంగా వర్గీకరణ అంశాన్ని బలపరుస్తూ మాదిగలకు భరోసానిస్తున్నారు. ఢిల్లీ వేదికగా వర్గీకరణ కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం గర్హనీయం. వర్గీకరణకు చట్టబద్ధత కోసం బీజేపీ కట్టుబడి ఉండాలి. లేకపోతే మాదిగల ముందు బీజేపీ దోషిగా నిలబడక తప్పదు.
డాక్టర్ బొల్లికొండ వీరేందర్, 98665 35807
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మాదిగ జేఏసీ)