రాష్ట్ర ప్రజలకు సామాజిక భద్రతను కల్పించటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 2014 నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ‘ఆసరా పథకం’ ప్రారంభించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో పది వర్గాల ప్రజలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల అభ్యున్నతికి, పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ పథకం అమలు ప్రారంభమైంది. మొదట్లో ఏడు వర్గాల ప్రజలకే ఈ పథకం అమలైనా 2015లో బీడీ కార్మికులను, 2017లో ఒంటరి మహిళలను, 2018లో బోధకాళ్లతో బాధపడే వారిని కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు, సంవత్సర ఆదాయం రూ.లక్షా 50 వేలు, పట్టణ, నగర ప్రాంతాల్లో ఏడాదికి రూ.2 లక్షల లోపు ఆదాయం కలిగినవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం 2014 నుండి 2019 మే వరకు అర్హులైనవారికి రూ.వెయ్యి చొప్పున పింఛన్ అందించింది. 2019 జూన్ నుంచి దివ్యాంగులకు రూ.2,016, కళాకారులకు రూ.3,0 16 చొప్పున అందజేస్తున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో వితంతువులు 14 లక్షల 50 వేల మంది ‘జీవనాధారం’ పేరుతో లబ్ధి పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.2,016 చొప్పున ఇచ్చి ఆదుకుంటున్నది. దీనికి కనీసం18 ఏండ్లు నిండినవారై ఉండాలి. ఆ మహిళ భర్తచనిపోయిన సర్టిఫికెట్ ఉండాలి. వీరికి నీలం రంగు కార్డులను పంపిణీ చేసి ఒక పెద్దన్నగా కేసీఆర్ ఆదుకుంటున్నారు. అయినవారే ఆదుకోని వయోవృద్ధుల సంరక్షణ కోసం ఆ ఇంటి పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ వారిని అక్కున చేర్చుకుంటున్నరు. రాష్ట్రంలోని వృద్ధులు 12 లక్షల 5 వేల మంది ‘రక్షణ’ పేరుతో ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 65 ఏండ్లు నిండి ఉన్న మహిళలు, పురుషులు దీనికి అర్హులు. ఇటీవల ప్రభుత్వం వయోపరిమితిని 57 ఏండ్లకు కుదించడం ముదావహం.
సమాజంలో అనేక విధాలుగా వివక్షను ఎదుర్కొంటున్న దివ్యాంగులు రాష్ట్రంలో 5 లక్షల 20 వేల మంది ఉన్నారు. వీరికి ‘భద్రత’ పేరుతో నెలకు రూ.3,016 చొప్పున పింఛన్ రూపేణా అందుతున్నది. వీరికి వయస్సుతో సంబంధం లేదు. కానీ 40 శాతం అంగవైకల్యం ఉండాలి. వీరికి లేతాకుపచ్చ రంగులో ఉన్న కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు ‘ఆలంబన’ అనే పేరుతో నెలకు రూ.2,016 పింఛన్ అందిస్తున్నది. 50 ఏండ్లు నిండినవారు అర్హులు. వీరికి ప్రభుత్వం గులాబీ రంగు కార్డులను పంపిణీ చేసింది. అలాగే 50 ఏండ్లకు పైబడిన చేనేత కార్మికులకు ‘చేయూత’నిస్తున్నది. నెలకు రూ.2,016 చొప్పున అందిస్తున్నది. బీడీ కార్మికులకు ‘ఆర్థిక’ అనే పేరుతో 18 ఏండ్లు నిండినవారికి నెలకు రూ.2,016 పింఛన్ అందిస్తున్నది. ఎయిడ్స్ రోగులకు వయసు పరిమితి లేదు. కానీ (ఏఆర్టీ) కొద్దిమంది పుట్టుకతోనే ఎయిడ్స్తో పుట్టవచ్చు. అలాంటివారు ‘యాంటీ రెట్రోవైరల్ థెరపీ సర్టిఫికెట్’ కలిగి ఉండాలి. వీరికి ప్రభుత్వం రూ.2,016 అందిస్తున్నది.
ఇలా సమాజంలో వివిధ వర్గాలుగా వివక్ష, ఆసరా లేనివారు 39 లక్షల 10 వేల మంది నేడు పింఛన్లు పొందుతున్నారు. వీరందరికి ఏటా రూ.9,100 కోట్లు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇంత పెద్ద మొత్తంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. ఈ ఆసరా పథకం పేదరిక నిర్మూలనలో, ఆత్మగౌరవం నిలపటంలో ఒక గొప్ప మార్పు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కవులు, కళాకారులు త్యాగపూరితంగా కృషిచేశారు. వారికి ప్రభుత్వం నెలకు రూ.3,016 చొప్పున పింఛన్ అందిస్తూ గౌరవించుకుంటున్నది. రాష్ట్రంలో ఒంటరి మహిళలు లక్షా 30 వేల మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు 30 ఏండ్లు, పట్టణ ప్రాంత మహిళలకు 35 ఏండ్లు నిండి, వివాహం కాకుండా ఉన్నవారిని ఒంటరి మహిళలుగా గుర్తిస్తున్నారు. ‘స్వధన్’ పేరుతో నెలకు రూ.2,016 పింఛన్ ఇస్తూ ప్రభుత్వం వీరికి సమాజంలో గుర్తింపును, గౌరవాన్ని పెంపొందించింది.
ఇలా సమాజంలో వివిధ వర్గాలు, ఆసరా లేనివారు 39 లక్షల 10 వేల మంది నేడు పింఛన్లు పొందుతున్నారు. వీరందరికి ఏటా రూ.9,100 కోట్లు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇంత పెద్ద మొత్తంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. ఈ ఆసరా పథకం పేదరిక నిర్మూలనలో, ఆత్మగౌరవం నిలపటంలో ఒక గొప్ప మార్పు అని చెప్పవచ్చు.
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు ప్రభుత్వ పాలన శాఖ, కేయూ)
డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు
98480 73582