సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత స్వతంత్ర రాజ్యంగా మారిన ఉక్రెయిన్లోని తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్థానిక అస్థిరత, తిరుగుబాట్ల నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రష్యా లక్ష మంది సైనిక బలగాలను దింపితే, అందుకు ప్రతిగా అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి బలగాలను మోహరిస్తున్నది. తొమ్మిదేండ్లుగా ఉక్రెయిన్లో అనిశ్చితి సాకుతో ఆ ప్రాంతంపై ఆధిపత్యం కోసం అమెరికా, రష్యా పరస్పరం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏడున్నర దశాబ్దాల కాలంలో అగ్రరాజ్యాలు కయ్యానికి కాలుదువ్వుతూ బలప్రదర్శనకు దిగటం శాంతి కాముకుల్లో ఆందోళన కలిగిస్తున్నది.
2013లో ఉక్రెయిన్ పాలకుడు విక్టర్ యనుకోవిచ్పై పెద్ద ఎత్తున సాయుధ తిరుగుబాటు జరిగింది. ఆయన రాజధాని కీవ్ వదిలి రష్యా పారిపోవాల్సి వచ్చింది. దాంతో ఉక్రెయిన్ పార్లమెంట్ ‘రాడా’ తాత్కాలిక అధ్యక్ష, ప్రధానులను నియమించింది. వీరు యురోపియన్ యూనియన్తో కలిసి నడవాలని నిర్ణయించటంతో రష్యా అనుకూలవర్గాలు ఆందోళన చెందాయి. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాలను ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోంచే పాలనా సౌలభ్యం కోసం ఉక్రెయిన్లో భాగం చేసిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా 2014లో విలీనం చేసుకున్నది. నాటో కూటమిలో చేరాలనే ఒత్తిడిని ఒప్పుకోకపోవటంతోనే కిరాయి మూకలను సాయుధం చేసి ఉక్రెయిన్లో అస్థిరతను అమెరికా ఎగదోసిందనేది రష్యా ఆరోపణ. కాగా ప్రజాస్వామ్యం, ప్రాంతీయ సమగ్రతలను కాపాడటం కోసమే ఉక్రెయిన్ విషయంలో కలుగజేసుకుంటున్నామని అమెరికా చెప్పుకోవటం గమనార్హం.
స్వాతంత్య్రం ప్రకటించుకున్న ఉక్రెయిన్ ప్రాంతాలకు రష్యా మద్దతు ప్రకటిస్తే తీవ్ర పరిణామాలుంటాయని నాటో కూటమి హెచ్చరిస్తున్నది. అలాగే ఉక్రెయిన్ పాలకులకు మద్దతుగా 50 వేల బలగాలను పంపాలని బాల్టిక్, నల్ల సముద్ర ప్రాంతంలోని రుమేనియా, ఎస్తోనియా, లిథువేనియా, లిత్వియా దేశాలకు అమెరికా సూచించటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఉక్రెయిన్ కేంద్రంగానే కాదు, ప్రపంచంలోని ఇతరచోట్లా ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. తైవాన్ విషయంలో ఇప్పటికే అమెరికా, చైనా మధ్య యుద్ధ కుంపటి రాజుకుంటున్నది. తైవాన్పై చైనా యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తైవాన్కు మద్దతుగా దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధనావలు తిష్టవేశాయి. మొదటి, రెండో ప్రపంచయుద్ధం తర్వాత తిరిగి అదేస్థాయిలో ఆయుధ, సంపన్నదేశాల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేవటం ఆందోళనకరం. పెద్ద దేశాలు ఘర్షణలకు తావివ్వకుండా చర్చల ద్వారా శాంతి స్థాపనకు కృషిచేయాలి.