లక్నో: బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆఫ్జల్ అన్సారీ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ఆస్తులపై ఈడీ తనిఖీ నిర్వహిస్తోంది. లక్నో, ఘాజిపూర్ నగరాల్లో ఉన్న ప్రాపర్టీలపై ఈడీ సోదాలు చేపడుతోంది. మొత్తం 11 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ ప్రస్తుతం యూపీలోని బాండా జైలులో ఉన్నాడు. ముక్తార్ స్వస్థలం మొహమ్మదాబాద్. ఎంపీ అఫ్జల్ అన్సారీకి చెందిన ఢిల్లీ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. గ్యాంగ్స్టర్ చట్టం కింద అన్సారీ సోదరులకు చెందిన సుమారు 14 కోట్ల ఆస్తులను గత నెలలో యూపీ పోలీసులు అటాచ్ చేశారు. వారం క్రితం ఘాజిపూర్లో అన్సారీకి చెందిన రెండు ప్లాట్లను ప్రభుత్వం సీజ్ చేసింది. ఆరు కోట్ల ఖరీదైన ఫ్లాట్లను ముక్తార్ అక్రమ రీతిలో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.