న్యూఢిల్లీ, జనవరి 31: ‘దేశంలో వ్యవసాయరంగం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దీన్ని గాడిలో పెట్టేందుకు వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యక్రమాలను, సేంద్రియ సాగును, డ్రోన్ టెక్నాలజీ లాంటి ఆధునిక సాంకేతికతల వినియోగాన్ని పెంపొందించాలి. పంటల మార్పిడితోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను, నానో యూరియా లాంటి ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యమివ్వాలి’.. ఇదీ పార్లమెంటులో సోమవారం కేంద్ర ప్రభుత్వం సమర్పించిన కేంద్ర ఆర్థిక సర్వే నివేదిక! రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించాలని కూడా సూచించింది. వాస్తవానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు, పంటల మార్పిడివైపు మళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలను కేంద్ర ఆర్థిక సర్వే సంపూర్ణంగా సమర్థించినట్టయింది. వ్యవసాయరంగంలో స్థిరమైన వృద్ధిని పెంపొందించేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు పంటల మార్పిడి విధానం ఓ సాధనంలా ఉపయోగపడుతుందని సర్వే పేర్కొన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నూనె గింజలు, పప్పుదినుసులు, ఉద్యాన పంటల సాగుకు అధిక ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేసింది. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పిస్తున్నప్పటికీ తక్కువ నీటితో అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతుల దృష్టిని మరల్చేందుకు రాష్ర్టాల సమన్వయ కృషి కూడా అవసరమని పేర్కొన్నది. విచిత్రం ఏమిటంటే.. ఇదే పంట మార్పిడి ప్రయత్నాల్లో భాగంగా రైతులు ఈ యాసంగిలో వరి పండించవద్దని రాష్ట్రం నచ్చజెపితే.. ఇక్కడి ప్రతిపక్ష బీజేపీ నేతలు మాత్రం.. ఆరు నూరైనా వరే పండించండి.. ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తామంటూ గందరగోళం రేపి.. వారిని అయోమయంలో పడేశారు. అలాంటి నేతలకు ఆర్థిక సర్వే చెంపపెట్టులా ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుబంధ రంగాలపై తెలంగాణ శ్రద్ధ
వ్యవసాయరంగం వృద్ధికి దోహదపడే అనుబంధ రంగాలకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరమున్నదని, ఇందులో భాగంగా పాడి, పశుసంవర్ధక, మత్స్య రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వానికి ఆర్థిక సర్వే సూచించింది. వ్యవసాయ కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులను సమకూర్చేది అనుబంధ రంగాలేనని పేర్కొన్నది. కరోనా కష్టకాలంలో రైతులను ప్రధానంగా ఆదుకొన్నది ఈ రంగాలేనని తెలిపింది. దీంతో 2014లో రూ.6,426గా ఉన్న రైతుల నెలవారీ ఆదాయం 15 శాతం పెరిగి 2021లో రూ.10,218కి చేరినట్టు వెల్లడించింది. ఇదే నిజమైతే బీహార్, యూపీ లాంటి రాష్ర్టాల నుంచి కూలీలు తెలంగాణకు భారీగా ఎందుకు వలస వస్తున్నారన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) 3.6 శాతం వృద్ధిరేటు సాధించిన వ్యవసాయ రంగం ఈసారి 3.9 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
పెరిగిన ఆదాయం ఏదీ ?
రైతుల ఆదాయం పెరిగిందని ఆర్థిక సర్వే చెప్తున్నా.. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా లేదన్న విషయం క్షేత్ర స్థాయి పరిస్థితలను గమనిస్తే అర్థమవుతున్నది. తెలంగాణ వంటి రాష్ర్టాలకు బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్రతోపాటు దక్షిణాది రాష్ర్టాల నుంచి కూడా వచ్చి పనులు చేసుకుంటున్న దుస్థితిని గమనించవచ్చు. తెలంగాణలో వర్తింపజేస్తున్న రైతు పథకాలు తమ రాష్ర్టాల్లోనూ ఉన్నట్టయితే తమకు ఉన్న కొంచెం భూమిని సాగు చేసుకుని అక్కడే ఉండేవాళ్లమని వారు చెప్తున్నారు.