లండన్: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి 15 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ జరగలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓ ఆఫర్ ప్రకటించింది. ఇండోపాక్ టెస్ట్ సమరానికి తాము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం పాకిస్థాన్లో ఇంగ్లండ్ జట్టు పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఈసీబీ డిప్యూటీ చైర్మెన్ మార్టిన్ డార్లోవ్.. పాక్ క్రికెట్ బోర్డుతో మంతనాలు జరిపారు. ఇండోపాక్ దేశాల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇండియా, పాక్ మధ్య 2007లో చివరిసారి టెస్ట్ మ్యాచ్ జరిగింది. బ్రిటన్లో దక్షిణాసియా జనాభా పెద్ద సంఖ్యలో ఉందని, భారీసంఖ్యలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే వీలు ఉంటుందని మార్టిన్ తెలిపారు. తటస్థ వేదికపై పాక్తో ఆడేందుకు ఇండియా కూడా రాజకీయంగా అంగీకరించే అవకాశాలు ఉన్నట్లు ద టెలిగ్రాఫ్ పత్రిక తన కథనంలో ప్రచురించింది. పాక్తో ఆడేందుకు ఇండియాకు ఎప్పుడూ వెల్కమ్ చెబుతామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ తెలిపారు.