హైదరాబాద్/లింగాల, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన ప్రముఖ కిన్నెరమెట్ల జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య సోమవారం ఢిల్లీలో పద్మశ్రీ అవార్డును అందుకొన్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డును అందుకొనే ముందు మొగిలయ్య రాష్ట్రపతి భవన్లో ఆశీనులైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, పలువురు కేంద్ర మంత్రులకు అభివాదం చేశారు. అనంతరం రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకొంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఇంతటి గౌరవం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తన కళను గుర్తించడం వల్లనే తనకు స్థాయిలో గుర్తింపు లభించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో తొలివిడతగా సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. మొగిలయ్యతోపాటు తెలుగువారైన సుంకర వెంకట ఆదినారాయణరావు (మెడిసిన్), గరికపాటి నర్సింహారావు (లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్), గోసవీడు షేక్ హసన్ సాహిబ్ (కళలు) పద్మశ్రీ పురస్కారాలను అందుకొన్నారు. తెలంగాణకు చెందిన రామచంద్రయ్య, పద్మజారెడ్డి, కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా ఈ నెల 28న రెండో విడతలో పద్మ అవార్డులను అందుకోనున్నారు.