మెదక్, డిసెంబర్ 7: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు సంబంధించిన జమున హేచరీస్ సంస్థ భూకబ్జా ముమ్మాటికీ నిజమేనని మెదక్ కలెక్టర్ హరీశ్ స్పష్టంచేశారు. జమున హేచరీస్ యజమాని ఈటల జమున చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మంగళవారం ఆయన స్పందించారు. ఆ కంపెనీ భూ అక్రమాల వ్యవహారంపై బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారమే అధికారులు సర్వే చేశారని చెప్పారు. ఆ పరిశ్రమ కబ్జాలకు పాల్పడినట్టు, అసైన్డ్, నిషేధిత భూములు కొనుగోలు చేసినట్టు సర్వేలో ఆయాశాఖల అధికారులు గుర్తించారని పునరుద్ఘాటించారు. జమున లేవనెత్తిన అ న్ని అంశాలపై అన్ని ఆధారాలతో లిఖిత పూర్వకంగా మీడియాకు ప్రెస్నోట్ విడుదలచేశారు.
అక్రమాలకు ఆధారాలు ఇదిగో..
సీసీ నంబరు 1491/mdk/75 dt.11.07.1990 ప్రకారం అచ్చంపేటలోని సర్వే నంబరులో మొత్తం 18.35 ఎకరాల సీలింగ్ మిగులు భూమి ఉన్నది. సర్వే నంబరు 130లోని మూడెకరాల భూమిని ప్రభుత్వం 11 మంది నిరుపేదలకు కేటాయించింది. అం దులో ఎలాంటి పట్టాభూమి లేదు. ఆ భూమిపై ఎలాంటి హక్కులు లేని రామారావు నుంచి కొనుగోలు చేసినట్టు జమున హేచరీస్ డాక్యుమెంట్లో చూపింది. నం.27703/L.Rev./ 2006-08, dt.17-12-2007 ప్రకారం 2007 నుంచి ఈ సర్వే నంబర్లో రిజిస్ట్రేషన్లు నిషేధించారు. ప్రస్తుతం ఇదే భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి భారీ పౌల్ట్రీ షెడ్లతో జమున హేచరీస్ ఆక్రమించింది.
అచ్చంపేటలోని సర్వే నంబరు 81లో మొత్తం 16.91 ఎకరాల భూమి ఉంది. ఇందులో 14.05 ఎకరాలు సీసీ నంబరు 1491/MDK/75 dt.11-07-1990 మరియు CC NO.919/D/75 Dt.03-03-1991 ప్రకారం మిగులు భూమి. ఆ తర్వాత పౌతిని తయారుచేసి భూమిలేని ఏడుగురు నిరుపేదలకు వెల్దుర్తి తాసిల్దార్ ప్రొసీడింగ్ నంబరు C/646/1989 dt.22-08-1994 ద్వారా ఇచ్చారు.
ఈటల రాజేందర్ కొనుగోలు చేసిన సర్వే నంబరు 81లోని 5.36 ఎకరాల భూమి చట్టవిరుద్ధమని తేలింది. B/1901/2010 dt.19.12.11 నోటిఫికేషన్ ద్వారా CARDలోని నిషేధిత ఆస్తుల జాబితాలో సర్వే నంబరు 81 భూమిని చేర్చారు. ఇక్కడా ఆ భూమిపై ఎలాంటి హక్కులేని రామారావు నుంచి కొనుగోలు చేశారు. సర్వే నంబరు 81లోని 14.05 ఎకరాల అసైన్డ్ భూమిని జమున హేచరీస్ ఆక్రమించింది.
జమున ముక్కునేలకు రాయాలి
ఎక్కడైనా ఒక గుంట స్థలం ఆక్రమించినట్టు తేలితే ముక్కు నేలకు రాస్తానని చెప్పిన ఈటల జమున, తప్పు జరిగిందని ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట శివారులో జమున హేచరీస్ అక్రమంగా 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములు కబ్జా చేసిందని నిజాల బయటపెట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్పై కేసులు పెడతామని ఈటల జమున హెచ్చరించడం సరికాదని హితవు పలికారు.
జమున వ్యాఖ్యలు అభ్యంతరకరం
మెదక్లో సమావేశమైన జిల్లా అధికారుల సంఘం.. కలెక్టర్ హరీశ్పై ఈటల జమున చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింది. డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ… రాజకీయ దురుద్దేశంతో ఈటల జమున కలెక్టర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం బాధకలిగించిందని చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, డీఈవో రమేశ్కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీశ్, తదితరులు ఉన్నారు. జమున హేచరీస్ కబ్జా చేసిన భూములను తిరిగి అప్పగించాలని ఎమ్మార్పీఎస్ నేత యాదగిరి కోరారు.
మా భూమి మాకు కావాలి
మాసాయిపేట మండలం హకీంపేటలో సర్వే నంబర్ 130లో మాకు రెం డు ఎకరాల భూమి ఉన్నది. మా భూమి ని జమున హేచరీస్ వాళ్లు ఆక్రమించుకున్నారు. మేము ఎప్పుడు వెళ్లినా ఇది మీ భూమి కాదం టూ పంపించేస్తున్నారు. మా భూములు మాకు కావాలి. జమున హేచరీస్ పరిశ్రమ వదిలే వ్యర్ధాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-రాంచంద్రం, హకీంపేట్ సర్పంచ్ భర్త