వీణవంక, అక్టోబర్ 26: బీజేపీ నేత ఈటల రాజేందర్ పదవిలో ఉన్నప్పుడు తినేకాడికి తిని.. ఇప్పుడు ప్రజల సానుభూతి కోసం దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు. మంగళవారం వీణవంక మండలం మామిడాలపల్లి, ఎలుబాక, ఘన్ముక్ల, మల్లన్నపల్లి, బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచార సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం వీణవంకలో మీడియాతో మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుతోనే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమైక్య పాలనలో మరుగున పడిన కులవృత్తులకు చేయూత అందించింది టీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టంచేశారు. బీజేపీ నేతలు విమర్శలు మాని ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు. బండి సంజయ్ గెలిచి రెండున్నరేండ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదని, కేవలం ఎన్నికల కోసమే ఇప్పుడు తిరుగుతున్నారని చెప్పారు. కొత్తబిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు రేవంత్రెడ్డి తిట్టడం తప్పా వేరే పని లేదని విమర్శించారు. ఈటల గెలిస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని, పేదింటి బిడ్డ గెల్లును గెలిపిస్తమని ప్రజలు అంటున్నారని చెప్పారు. గొల్ల, కురుమలు నిండు మనసుతో గెల్లును ఆశీర్వదించి, అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.