దృష్టి మళ్లించి సెల్ఫోన్లు తస్కరించే నాలుగు ముఠాలకు చెందిన 9 మంది నిందితులను ఈస్ట్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి.. రూ. 12 లక్షల విలువైన 92 సెల్ఫోన్లను రికవరీ చేశారు. బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం సీపీ అంజనీకుమార్ ఈ గ్యాంగ్ల వివరాలు వెల్లడించారు.
హఫీజ్బాబానగర్కు చెందిన మహ్మద్ అలీ, మహ్మద్ ఖాన్, అమీర్ ఖాన్ పాత నేరస్తులు. గతేడాది జైలు నుంచి విడుదలై.. ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలను అద్దెకు తీసుకొని.. అమీర్ఖాన్ డ్రైవింగ్ చేస్తుంటే.. మిగతా ఇద్దరు ఆటోలో ప్రయాణికులుగా కూర్చుంటారు. ఇతర ప్రయాణికులు ఎక్కగానే దృష్టి మళ్లించి.. సెల్ఫోన్లు దొంగతనం చేస్తుంటారు. ఈ ముఠాపై కంచన్బాగ్, డబీర్ఫురా, కాలాపత్తార్, చాదర్ఘాట్లో రెండు, రాయదుర్గం, మైలార్దేవ్పల్లిలో రెండు కేసులు, మారేడ్పల్లిలో ఒక కేసు నమోదైంది. నిందితుల నుంచి 26 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మైలార్దేవ్పల్లికి చెందిన మహ్మద్ మెహసిన్ పాత నేరస్తుడు. 2013 నుంచి నేరాలు చేస్తుండటంతో 2020లో ఇతడిపై ఫలక్నుమా పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో జైలు నుంచి బయటకు వచ్చిన మెహసిన్ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ మూసతో కలిసి ఆటో డ్రైవర్ల దృష్టి మళ్లించి సెల్ఫోన్లు, రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగతనాలకు పాల్పడుతున్నారు. చాంద్రాయణగుట్టలో మూడు, మీర్చౌక్, చార్మినార్, సనత్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుల నుంచి 14 ఫోన్లు రికవరీ చేశారు.
సంతోష్నగర్కు మహ్మద్ అబ్దుల్ హాజీ, మహ్మద్ రఫీక్ అలియాస్ టోతులు స్నేహితులు. చెడు అలవాట్లకు బానిసై.. చోరీలు చేయడం మొదలుపెట్టారు. రాత్రి వేళల్లో ఇండ్లలోకి ప్రవేశించి సెల్ఫోన్లు తస్కరిస్తున్నారు. వాటిని తెలిసిన వారికి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. డబీర్పురా, మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనం కేసులు ఈ ముఠాపై నమోదవ్వగా, 28 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పహాడీషరీఫ్కు చెందిన మహ్మద్ మనసూర్, దస్తగిరి ఇద్దరు పాత నేరస్తులు. 2021లో మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు పంపించారు. విడుదలైన తరువాత ఆటోను కిరాయికి తీసుకొని..ప్రయాణికుల దృష్టి మళ్లించి సెల్ఫోన్లు అపహరిస్తున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 24 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విడిభాగాలుగా చేసి..దుకాణాల్లో అమ్మేసి..
సెల్ఫోన్ దొంగలు ట్రెండ్ మార్చారు. ఐఎంఈఐ నంబర్తో పోలీసులు పట్టుకుంటుండటంతో కొత్త ఎత్తులు వేస్తున్నారు. సెల్ఫోన్లను విడిభాగాలుగా చేసి.. దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ నగరంలో వంద వరకు చరవాణిలు మాయమవుతుండగా.. అందులో పదుల సంఖ్యలో మాత్రమే పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ‘ఐఎంఈఐ’ ఆధారంగా గుర్తించి, బాధితులకు అందజేస్తున్నారు. అయితే కొందరు తస్కరించిన సెల్ఫోన్లను ఆన్చేయకుండా.. అలాగే ఉంచి..దుకాణాల నుంచి ఆర్డర్ రాగానే వాటి మదర్బోర్డు, కెమెరా, టచ్స్క్రీన్, కీ బోర్డు.. ఇలా ఒక్కో భాగాన్ని అమ్మేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
బాధితులకు అందజేస్తాం : సీపీ
నాలుగు ముఠాలకు సంబంధించి ఇప్పటి వరకు ట్రై పోలీస్ కమిషనరేట్లలో 19 కేసులు నమోదయ్యాయని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. రివకరీ చేసిన 92 సెల్ఫోన్లను బాధితులకు అందజేస్తామని చెప్పారు. నేరప్రవృత్తిని మానుకోని వారిపై పీడీయాక్ట్ ప్రయోగిస్తున్నామని, ఈ ఏడాది 141 మందిపై విధించామని వివరించారు.