బెజ్జూర్/చింతలమానేపల్లి: ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి పలు మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. దీంతో ఇండ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఇండ్లలోని మంచాలు కదలడం, ఇండ్లపై కప్పులుగా ఉన్న రేకుల చప్పుడు రావడం, వంట సామగ్రి నేలపై పడడంతో ప్రజలు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు గూడెం, దిందా ,బాలాజీఅన్కోడ, గంగాపూర్, బాబాపూర్, కర్జెల్లి, రవీంద్రనగర్-2లో 3 సెకనుల పాటు భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. దిందా గ్రామంలో వాగుమరి రాకేశ్కు చెందిన పశువుల కొట్టం కూలినట్లు బాధితుడు తెలిపాడు.
మంచిర్యాల జిల్లాకేంద్రంతో పాటు లక్షెట్టిపేట, చెన్నూర్ మండలం ముత్తరావు పల్లె, కిష్టంపేట, కోటపల్లి మండలంలోని రాంపూర్, రొయ్యలపల్లి, వేమనపల్లి మండలంలోని నీల్వాయి, గొర్లపల్లి, బెల్లంపల్లి, తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్, దండేపల్లి, నెన్నెల్లో భూమి స్వల్పంగా కంపించింది. సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కూడా భూకంపం వచ్చినట్లు తెలిసింది. గడ్జిరోలిలో 4.3గా నమోదైంది. గత శనివారం కూడా మంచిర్యాల చుట్టు పక్కప్రాంతాల్లో భూకంపం సంభవించడం, రిక్టర్ స్కేల్లో 4.3గా నమోదుకావడం గమనార్హం