లండన్: భూమి తన చుట్టూ తానే తిరిగే వేగం పెరుగుతున్నది. దీంతో నిర్ణీత 24 గంటలకు ముందే భూ భ్రమణం పూర్తవుతున్నది. భూమి తన వేగాన్ని మరోసారి రికార్డ్ బ్రేక్ చేసింది. జూలై 29న 1.59 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూ భ్రమణం పూర్తయ్యింది. దీంతో చాలా చిన్న రోజుగా రికార్డుకెక్కింది. అయితే 1960 తర్వాత 2020లో తొలిసారి ఇలా జరిగింది. 2020 జూలై 19న 24 గంటల కంటే 1.47 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూమి తన చూట్టూ తిరగడాన్ని పూర్తి చేసింది. 2021లో కూడా భూ భ్రమణం వేగం పెరిగింది.
మరోవైపు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగడానికి సరైన కారణాలు ఇప్పటికీ తెలియదు. అయితే భూమి లోపలి లేదా బయట పొరల్లో మార్పు, మహాసముద్రాలు, ఆటుపోట్లు, వాతావరణంలో మార్పులు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే భౌగోళిక ధ్రువాల కదలికల వల్ల భూ భ్రమణం వేగం పెరగుతున్నదని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. దీనిని ‘చాండ్లర్ వొబుల్’ అని వ్యవహరిస్తున్నారు.
కాగా, భూ భ్రమణం వేగం పెరుగడం వల్ల నెగిటివ్ లీప్ సెకండ్లకు దారి తీస్తుందని పరిశోధనకులు పేర్కొన్నారు. ఇది గ్లోబల్ సమయంపై ప్రభావం చూపడంతోపాటు కంప్యూటర్ ప్రొగ్రామ్లను క్రాష్ చేసి డేటా స్టోరేజ్ను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.