హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/సత్తుపల్లి: హైదరాబాద్ నుంచి అస్ట్రేలియాకు కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారాన్ని హైదరాబాద్ బేగంపేట పోలీసులు, డీఆర్ఐతో కలిసి బట్టబయలు చేశారు. ఫొటో ఫ్రేమ్స్లో మాదకద్రవ్యాలను పెట్టి కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందటంతో బేగంపేటలోని ఇంటర్నేషనల్ కొరియర్ ఏజెన్సీపై దాడి చేసి రూ.5.5 కోట్ల విలువైన 14.2 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
గురువారం కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. మార్కెట్లో ఈ డ్రగ్ కిలో రూ.40 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ దందా వెనుక తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు రవాణా చేస్తున్న రూ.1.43 కోట్ల విలువైన 566 కిలోల గంజాయిని సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ గురువారం తెలిపారు.