సిటీబ్యూరో, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): విలాసవంతమైన జీవనం కోసం.. ఓ అరబిక్ మాస్టర్ డ్రగ్స్ సరఫరాదారుడిగా మారాడు. గోవాలోని ప్రధాన డ్రగ్స్ వ్యాపారికి హైదరాబాద్లో ఏజెంట్గా పని చేస్తూ.. యువతను మత్తులో ముంచుతున్నాడు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి రూ. 26.28 లక్షలు విలువ చేసే డ్రగ్స్తో పాటు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం… గొరెంట్ల చరణ్తేజా, శ్రావణ్కుమార్ స్నేహితులు. గచ్చిబౌలి రాంకీ టవర్స్లో వీరిద్దరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుసుకున్న ఎస్వోటీ మాదాపూర్ ఇన్స్పెక్టర్ శివ నేతృత్వంలోని బృందం పట్టుకుంది. విచారణలో టోలిచౌకీలో నివాసముండే అరబిక్ పాఠాలు నేర్పే మహ్మద్ అష్రఫ్ బేగ్ విషయం బయటపడింది. అతడిని అదుపులోకి తీసుకుని సోదాలు చేయగా, 183 గ్రాముల కొక్కైన్, 44 ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ దొరికాయి.
మహ్మద్ అష్రఫ్ విమానంలో గోవా వెళ్లి..అక్కడ నైజీరియా దేశానికి చెందిన జూడ్ వద్ద డ్రగ్స్ను తీసుకుని..ప్రైవేటు బస్సులో హైదరాబాద్ తెచ్చి.. అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఇలా నగరంలో చాలా మందికి బేగ్ డ్రగ్స్ను విక్రయిస్తూ.. భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. జూడ్కు డ్రగ్స్ సముద్రం మార్గంలో గోవాకు వస్తుందని తేలింది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
డ్రగ్స్, గంజాయి, హశీశ్ అయిల్ తదితర మత్తు పదార్థాలు విక్రయించకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టం. ఈ ఏడాదిలో మత్తు పదార్థాల దందా చేసే 419 మందిని అరెస్టు చేశాం. 23 మంది డ్రగ్స్ కేసుల నిందితులపై పీడీ యాక్ట్లు పెట్టాం. గంజాయి-1770 కేజీలు, మొక్కలు -124, పిల్స్-14, హశీశ్ అయిల్-9 లీటర్లు, లిరియా ట్యాబ్లెట్లు-12, అల్ఫాజోలమ్-141 కేజీలు, ఒపీఎం-200 గ్రాములు, ఎండీఎంఏ పిల్స్-61, ఎల్స్డీ పేపర్స్-3, కొక్కైన్-183 గ్రాములు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. – సీపీ స్టీఫెన్ రవీంద్ర