Hyderabad | హైదరాబాద్ : సూరారంలో డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్స్ ఎస్పీ చక్రవర్తి పలు విషయాలను వెల్లడించారు.
పట్టుబడ్డ ముగ్గురు సభ్యుల నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంపెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంపెటమైన్ను స్వాధీనం చేసుకున్న పేర్కొన్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ. 50 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.
ఈ ముఠాలోని ప్రధాన నిందితుడిని కమ్మ శ్రీనివాస్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. కమ్మ శ్రీనివాస్ ప్రయివేటు ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో ఉంటున్నట్లు తెలిపారు. మరో నిందితుడు మణికంఠ.. కాకినాడ వాసి కాగా, అతనికి చేపల చెరువులు ఉన్నట్లు చెప్పారు. మూడో నిందితుడు నరసింహ రాజు సూపర్ వైజర్ కం డ్రైవర్గా పని చేస్తున్నట్లు గుర్తించారు.
అయితే కమ్మ శ్రీనివాస్ 2013లో ఓ పరిశ్రమలో పని చేస్తున్నప్పుడు.. క్రిస్టల్ మెథాంపెటమైన్ను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో ఎన్సీబీ వాళ్ళు పట్టుకుని జైలుకు పంపారు. నాలుగు సంవత్సరాల క్రితం జైలు నుంచి బయటికొచ్చాడు. జైలు నుండి బయటికొచ్చాక నరసింహ రాజు, మణికంఠతో కలిసి డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇందుకు సూరారంలో ఓ ఇల్లును కిరాయికి తీసుకొని, డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించారు. గత రెండేండ్ల నుంచి వీళ్లు డ్రగ్స్ తయారు చేసి, వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు కొనసాగించారు. మెథాంఫెటమైన్ డ్రగ్ను రిలాక్స్ మూడ్లోకి తీసుకెళ్తుందని వినియోగిస్తారు. ఈ ముగ్గురు నిందితులపై పీడీయాక్ట్ ప్రపోజ్ చేస్తామన్నారు.