న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధులను వెచ్చించి మూడు నెలల్లో 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్ధ (డీఆర్డీఓ) ఏర్పాటు చేస్తుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ప్రకటించారు. తేలికపాటి తేజాస్ యుద్దవిమానాల్లో ఆన్ బోర్డ్ ఆక్సిజన్ ఉత్పత్తికి డీఆర్డీఓ అభివృద్ధి చేసిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ టెక్నాలజీ ప్రస్తుత కరోనా మహమ్మారితో నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభాన్ని నివారించేందుకు ఉపకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో భారత్ లో తాజాగా 3,60,960 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 3293 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 2,51,827 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కోసం కొవిన్, ఆరోగ్యసేతు, ఉమంగ్ యాప్ ల్లో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతోంది.