హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): లైంగికదాడి, హత్యకు గురైన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం మంజూరుచేసిన డబుల్బెడ్రూం ఇంటి పట్టాను మంత్రులు చిన్నారి తల్లిదండ్రులకు బుధవారం అందజేశారు. చిన్నారి పట్ల జరిగిన అమానుషమైన ఘటన బాధాకరమని తలసాని పేర్కొన్నారు. చిన్నారి కుటుంబానికి తక్షణ సహాయంగా జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ రూ. 50 వేలు ఇచ్చిందని, ఆ తరువాత ప్రభుత్వం కూడా రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం మేరకు సైదాబాద్లోని పిల్లి గుడిసెల కాలనీలో ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో ఒక ఇంటిని కేటాయించినట్టు తెలిపారు. ఇల్లు మంజూరు పత్రాన్ని, ఇంటి తాళాన్ని చిన్నారి తల్లిదండ్రులకు అందజేస్తున్నట్టు చెప్పారు. సైదాబాద్ తాసిల్దార్ ప్రసాద్ డబుల్ బెడ్రూం ఇండ్లలో 514 నంబర్ ఇంటిని చిన్నారి కుటుంబానికి అప్పగించారు.