రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): సినీ నటి సమంతపై యూట్యూబ్ చానెళ్లలో దుష్ప్రచారం ఎపిసోడ్కు తెరపడింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయొద్దని కూకట్పల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేయడంపై సమంత ఇటీవల కూకట్పల్లి కోర్టును ఆశ్రయించారు. ఓ వైద్యుడితోపాటు మరో మూడు యూట్యూబ్ చానళ్లపై పరువునష్టం దావా వేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై యూట్యూబ్ చానళ్లలో ఓ వైద్యుడు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మీడియా, పత్రికల ద్వారా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోర్టును కోరా రు. వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించడం తగదని, ఇక నుంచి సమంతపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని, ఆమెను అగౌరపరిచే ఇంటర్వ్యూలను తొలగించేలా ఆదేశాలివ్వాలని సమంత తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. గతంలో ప్రసారమైన యూట్యూబ్ లింక్స్ తొలిగించాలని కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత వివరాలను సోషల్మీడియాలో పోస్ట్ చేయొద్దని సమంతకు సూచించింది.