మాదాపూర్, జనవరి 6 : శరీరంలో ఏ అవయవం సరిగ్గా లేకున్నా అవస్థలు అన్నీఇన్నీ కావు. విధి నిర్వహణలో తెగిన చేతివేళ్లను అధునాతన చికిత్సతో వైద్యులు అతికించారు. వివరాలిలా ఉన్నాయి… రాజస్థాన్కు చెందిన పూనంచాంద్ (23) బతుకుదెరువు కోసం కుటుంబసభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో నివాసముంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో చెక్కకోత మెషిన్ పనులు చేస్తుంటాడు. రెండు రోజుల క్రితం పనిచేస్తుండగా చేతివేళ్లు మెషిన్లో ఇరుక్కుపోయి రెండు వేళ్లు తెగిపడ్డాయి. దీంతో ఉపాధి కోల్పోయి ఆందోళన చెందుతున్నాడు. స్నేహితుడి సలహాతో హైటెక్సిటీలోని మెడికవర్ దవాఖానకు తరలించారు. కన్సల్టెంట్ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్, ఆర్థోపెడిక్ అండ్ ట్రౌమా సర్జన్ డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో మైక్రోస్కోపిక్ సహాయంతో నాలుగున్నర గంటలపాటు చికిత్స చేసి తెగిపడిన వేళ్లను విజయవంతంగా అతికించారు. అతి జాగ్రత్తగా క్లిష్టమైన చికిత్స చేసి చేతివేళ్లను అతికించామని, ప్రస్తుతం పూనంచాంద్ ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ సునీల్ తెలిపారు.