హిమాయత్నగర్, జనవరి19: ఒక వైపు వైద్య వృత్తిలో, మరోవైపు కరాటేలో రాణిస్తున్నాడు నగరానికి చెందిన డాక్టర్ ఎద్దుల కృష్ణారెడ్డి. తన పంచ్ పవర్తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఉస్మానియా వైద్య కాలేజీలో ఎంబీబీఎస్, చెన్నై అన్నామలై యూనివర్సిటీలో ఎంహెచ్ఎస్సీ పూర్తి చేశాడు. స్వామి వివేకానంద స్ఫూర్తితో సైదాబాద్లో వివేక్ దవాఖానను ప్రారంభించి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నాడు.
ఆత్మవిశ్వాసమే ఆయుధం..
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా 48 ఏండ్ల వయస్సులో కరాటే నేర్చుకోవడం ప్రారంభించాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జీవీఆర్ కరాటే అకాడమీ నుంచి పాల్గొని ఎన్నో పతకాలు సాధించాడు. కరాటే బ్లాక్ బెల్ట్ సాధిస్తూనే 70 ఏండ్ల వయస్సులో మార్షల్ ఆర్ట్స్ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. 75 బండలను పగులకొట్టి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ రికార్డ్స్, భారత్ రికార్డ్స్ను అందుకున్నారు. అంతేకాకుండా తన ఛాతిపై 159 బండలను పగులకొట్టించుకుని ప్రపంచ రికార్డ్స్ను పొందారు.
పేద విద్యార్థులకు అండగా..
నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటూ వారి చదువుకు అవసరమయ్యే సహాయసహకారాలు అందిస్తూ తన సేవా భావాన్ని చాటుకుంటున్నాడు. ఆరు మంది వైద్య విద్యార్థులు, ఐదు మంది ఇంజినీరింగ్ విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువులకు తోడ్పాటునందిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా, గన్యాగుల గ్రామంలో జన్మించిన అతను అక్కడ రెండు ఆలయాలను నిర్మించి ప్రజల్లో ఆధ్యాత్మికభావాన్ని పెంపొందింపజేశారు.