జెనీవా, మార్చి 20: కొవిడ్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తప్పుడు ప్రచారం, అవాస్తవ సమాచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర కారణాలతో పాటు ఇది కూడా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నదని హెచ్చరించింది. ‘మహమ్మారి కథ ముగిసింది, ఒమిక్రాన్ తీవ్రత తక్కువే, ఇదే కొవిడ్ చివరి వేరియంట్..’ అంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇటువంటి తప్పుడు వార్తలే.. వైరస్ ఇంకా వ్యాప్తి చెందడానికి కారణంగా ఉన్నాయని, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ ఖెర్కోవ్ శనివారం పేర్కొన్నారు. వ్యాధి తీవ్రతను, మరణాలను తగ్గించడంలో టీకా ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆమె నొక్కిచెప్పారు. గతకొన్ని రోజులుగా చైనా, దక్షిణ కొరియాతో పాటు పలు ఐరోపా దేశా ల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొవిడ్ ముగిం పు అనేది ఇంకా సుదూరంలోనే ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే పేర్కొన్నది. భవిష్యత్తులో కరోనా వేవ్లు సంభవించినప్పటికీ.. వ్యాక్సినేషన్ కవరేజ్, ఇమ్యూనిటీ కారణంగా మన దేశంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.