ధ్యానం అంటే.. భౌతికమైన కళ్లు మూసుకుని, మానసికమైన నేత్రాలు తెరవడమే! కానీ, 38 ఏండ్ల బాక్సర్ దివ్య జైన్ మాత్రం తనకు బాక్సింగే ధ్యానమని అంటున్నది. ‘సేఫెడ్యుకేట్’ అనే సంస్థకు సీయీవో, వ్యవస్థాపకురాలు అయిన దివ్య లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివింది. ఆ తర్వాత కుటుంబ వ్యాపారమైన రవాణా రంగంలోకి వచ్చింది. అది పెద్దగా సంతృప్తినివ్వలేదు. దాంతో గత కొన్నేండ్లుగా ఆమె పూర్తిగా బాక్సింగ్పైనే దృష్టి పెడుతున్నది. ‘మీరు పరుగెడుతున్నప్పుడు మనసు కూడా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. కానీ బాక్సింగ్లో అలా జరగదు. ఫోకస్ తగ్గిన ప్రతిసారీ పంచింగ్ బ్యాగ్ మిమ్మల్ని కొట్టేస్తుంది. ఇక్కడ ఏకాగ్రత, నిబద్ధత ముఖ్యం. బాక్సింగ్ సాధన చేస్తున్నప్పుడు మనసంతా బాక్సింగ్ మీదే ఉండాలి. ధ్యానంలోనూ, తపస్సులోనూ జరిగేది అదే. కాబట్టే, నేను ధ్యానం చేయను. బాక్సింగ్లోనే ఆ అనుభూతిని పొందుతాను’ అంటారామె. కరోనాతో జిమ్లు, ఫైటింగ్ క్లబ్లు మూతపడటంతో ఢిల్లీలోని సొంతింట్లో బాక్సింగ్ రింగ్ ఏర్పాటు చేసుకున్నారు దివ్య. యువతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు.