సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): స్నేహితులతో కలిసి ఆరేండ్లుగా నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నాడు. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో ‘ఫుడ్ బ్యాంక్ హైదరాబాద్’ పేరుతో అనాథల ఆకలి తీరుస్తూ కొండంత అండగా నిలుస్తున్నాడు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సీనియర్ సేల్స్ మేనేజర్గా పని చేస్తున్న మహ్మద్ అజీజ్.
34 ప్యాకెట్లతో ప్రారంభమై..
2015 అక్టోబర్లో పవిత్ర దినమైన శుక్రవారం సమాజ సేవ చేయాలన్న ఆలోచనను మహ్మద్ అజీజ్ తన తల్లితో పంచుకున్నాడు. అనంతరం ప్రాణస్నేహితులైన దిలీప్, సలాం, ఎక్బాల్, మాజీద్లతో కలిసి చర్చించి ఫుట్పాత్లపై ఉండే అనాథలు, పేదలు, వివిధ వైద్యశాలల వద్ద ఉండే రోగి సహాయకుల ఆకలి తీర్చాలని నిశ్చయించుకున్నారు. మొదటగా తన తల్లి 34 మందికి సరిపడా అన్నం ప్యాకెట్లను తయారు చేసి ఇవ్వగా అన్నార్థులకు అందించడం ప్రారంభించారు. ఇక ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ‘డబ్బులు ఎవరైనా సాయం చేయొచ్చు… కానీ మనం ఏమి తింటున్నామో.. అదే నాణ్యతతో ఆహారాన్ని అందజేయాలి’ అని తన తల్లి మాట ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు.
ఫేస్బుక్ పోస్టుకు స్పందన..
ప్రారంభించిన మూడో ఆదివారమే స్నేహితులతో కలిసి 100 ప్యాకెట్లు ప్రిపేర్ చేసి.. పంపిణీ చేశారు. నాల్గో సండే 200.. ఇట్లా ప్రతివారం పెంచుకుంటూ పోయారు. ‘సేవ చేయాలనే వారు నాణ్యమైన భోజనం అందజేయండి’ అనే నినాదంతో ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు విపరీతమైన స్పందన రాగా.. స్వచ్ఛందంగా పని చేసేవారిని కూడా ఆహ్వానించారు. ఇలా ప్రతి ఆదివారం 8 వందల మంది ఆకలి తీస్తున్నారు. ప్రతి శనివారం ప్రణాళిక రూపొందించుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆదివారం భోజనాలు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. దీపావళి, రంజాన్, క్రిస్మస్ పండుగలప్పుడు సుమారు 2వేల మంది పేదలకు అన్నదానం చేస్తున్నట్లు మహ్మద్ అజీజ్ తెలిపారు.
లాక్డౌన్ సమయంలో 8 వందల మందికి..
లాక్డౌన్ సమయంలో ఈ మిత్రబృందం ప్రతిరోజు 8 వందల మంది ఆకలి తీర్చింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా మిత్రులతో సమాచారాన్ని పంచుకొని సేవా కార్యక్రమాలు కొనసాగించింది. నగరంలో భారీ వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసరాలతో పాటు ఆహారం అందించింది. చలికాలంలో ఎంతోమందికి బ్లాంకెట్లు అందజేసింది. నిలోఫర్, నిమ్స్, బసవతారకం వైద్యశాలల్లో ఒక్కోరోజు ఒక్కోచోట రోగులు, రోగుల సహాయకుల ఆకలి తీర్చుతున్నది.