భోపాల్: గిరిజన వరుడి వివాహం సందర్భంగా అతడి వేషధారణపై వివాదం తలెత్తింది. దీంతో పెళ్లిలో ఘర్షణకు దారితీసింది. వధు, వరుల బంధువులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ధార్ నగరానికి చెందిన సుందర్ లాల్ అనే గిరిజనుడు ఈ నెల 7న పెళ్లి కోసం కుటుంబం, బంధువులతో కలిసి మంగ్బీడా గ్రామానికి చేరుకున్నాడు. అయితే అతడు షేర్వానీ ధరించడంపై పెళ్లి కుమార్తె బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు కోసం వరుడు ధోతీ, కుర్తా ధరించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె బంధువుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. వధువు, వరుడి తరుఫు బంధువులు ధమ్నోద్ పోలీస్ స్టేషన్కు చేరుకుని నిరసనకు దిగారు. వరుడి తరుఫు బంధువులు తమపై రాళ్లు రువ్వడంతో కొందరు గాయపడ్డారని వధువు తరుఫు మహిళలు ఆరోపించారు. అయితే వధువు కుటుంబం నుంచి ఎలాంటి వివాదం లేదని, ఆమె తరుఫు బంధువులే తమ బంధువులపై దాడి చేశారని వరుడు సుందర్ లాల్ ఆరోపించాడు. తాను షేర్వానీ ధరించడంపై పెళ్లి కుమార్తె బంధువులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో రాళ్లు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పాడు.
ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన అనంతరం అదే రోజున వరుడు, వధువు కుటుంబాలు ధార్ నగరానికి చేరుకుని అక్కడ వివాహం జరిపించారు.