నల్లగొండ ప్రతినిధి, మార్చి30(నమస్తే తెలంగాణ) : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సమయంలోనో లేదంటే కరోనా నిబంధనలు పాటించని సమయంలోనో వాహనదారులకు పోలీసులు జరిమానాలు వేయడం సర్వసాధారణం. ఇది అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా చేసేందుకు ట్రాఫిక్, సివిల్ పోలీసులు సైతం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నిత్యం జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల కాలంలో అందివస్తున్న టెక్నాలజీతో సీసీ కెమెరాలు లేదంటే చేతిలో ఉండే ఫోన్లలోనే ఉల్లంఘనలను చిత్రీకరిస్తూ నేరుగా సంబంధిత సమాచారాన్ని వాహనదారుల మోబైల్స్కే చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు తెలిసి చేసినా, తెలియక చేసినా జరిమానాల బారిన పడుతున్నారు. ఈ జరిమానాల చెల్లింపులపై మాత్రం పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడంతో వాహనాదారులు తేలికగా తీసుకుంటున్నారు. దీంతో ఆ వాహనం ఏదైనా ప్రమాదానికి గురైన సమయంలోనో, వాహనాన్ని మరొకరికి విక్రయించే సమయంలోనో ఈ చెల్లింపులు తప్పనిసరిగా చేస్తున్నారు. లేదంటే ఏండ్ల తరబడి అలాగే పెండింగ్లో ఉంటున్నాయి. ఇటీవల పోలీసులు స్పెషల్ డ్రైవ్లు చేపట్టి ఒక్కో వాహనాన్ని ఆపి నెంబర్పై పెండింగ్ చాలాన్ల క్లియరెన్స్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. అయినా సరే అంతకంతకూ పెండింగ్ చలాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పోలీసు శాఖ వినూత్నంగా రాయితీ స్కీంను ముందుకు తెచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల లోపు చెల్లించే వారికి వాహనాల సామర్థ్యాన్ని బట్టి రాయితీని వర్తింపజేస్తున్నట్లు ప్రచారం చేశారు. ద్వి, త్రిచక్ర వాహనాలకు 75శాతం, కార్లు, లారీలతో పాటు భారీ వాహనాలకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 70శాతంతో పాటు కరోనా కాలంలో మాస్క్ ధరించకుండా ప్రయాణించిన వారికి 90శాతం రాయితీని వర్తింపజేస్తున్నారు. వాస్తవంగా నేటితో గడువు ముగియనుండడంతో వినియోగదారుల విజ్ఞప్తి మేరకు మరో 15 రోజులు పొడిగించడం జరిగింది. పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై వినియోదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలారంభం నుంచి రాయితీ చెల్లింపు విషయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్త్రతంగా ప్రచారం చేపట్టారు. నల్లగొండ వంటి పట్టణాల్లో ప్రతి రోజూ మైకుల్లో ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో వాహనదారులు కూడా పెండింగ్ క్లియరెన్స్ కోసం ముందుకు వస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెలలోనే రాయితీ చెల్లింపును సద్వినియోగం చేసుకంటూ 1.21లక్షల కేసులు క్లియర్ అయ్యాయి. వీటికి సంబంధించి రాయితీ పోనూ 2.28కోట్ల రూపాయలు ఖజానాకు చేరాయి. 2018 నుంచి ఈ ఫిబ్రవరి 28 నాటికి మొత్తం జిల్లాలో 2.95లక్షల ఈ-చలాన్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం రూ.13.90 కోట్ల వాహనదారుల నుంచి రావాల్సి ఉంది. వీటిల్లో మంగళవారం నాటికి మొత్తం 41శాతం కేసుల్లో పెండింగ్ చలాన్లు క్లియరయ్యాయి.
నల్లగొండ జిల్లాలో 2019 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి మొత్తం 6,66,103 కేసులు నమోదు కాగా అందులో రూ.43.78కోట్ల జరిమానాలు విధించారు. ఇందులో ఈ ఫిబ్రవరి 28 నాటికి 3.46 కేసుల్లో 18.19కోట్ల రూపాయల జరిమానాలను వసూలు చేశారు. ఇవి కాకుండా మిగతా 3.19 లక్షల కేసుల్లో 20.14కోట్ల రూపాయల జరిమానాలు పెం డింగ్లో ఉన్నాయి. వీటి కోసం పోలీసు శాఖ రాయితీని ప్రకటించింది. ఈ రాయితీ కాలంలో మొత్తం జిల్లాలో 1.61లక్షల కేసుల్లో రూ.3.87 కోట్లను వా హనదారులు చెల్లింపులు చేశారు. మిగతా అమౌంట్ చెల్లించేందుకు పోలీస్ శాఖ ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించింది.