అమరావతి : గులాబ్ తుఫానుపై విశాఖపట్నం జిల్లా అధికారులతో ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నుబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్, రెవెన్యూ, అగ్నిమాపక, ఆర్అండ్బీ, జీవీఎంసీ, మత్స్యశాఖ సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన సామగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని, తీర మండలాల ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించాలని ఆదేశించారు. ఇందు కోసం గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహా ఇతర విభాగాల వారంతా సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. తుఫానుతో అనకాపల్లి, గాజువాక అధిక వర్షం కురిసిందని వివరించారు.
గులాబ్ తుఫాను ముప్పు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది. గార, కవిటిలో జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా పరిధిలోనే తుఫాను తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటనతో కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అధికారులకు సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీస్, మెరైన్, విద్యుత్, ఆర్అండ్బీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సెలవులు రద్దు చేశారు. తుపాను పరిస్థితులను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను గుర్తించిన అధికారులు.. కలెక్టరేట్తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.