తెలుగు చిత్రసీమలో మరో భారీ ప్రాజెక్ట్కు రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అగ్రహీరో ధనుష్తో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సినిమాకు యువ దర్శకుడు వెంకీ అట్లూరి నిర్దేశక బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. తెలుగు వెర్షన్కు ‘సార్’, తమిళ వెర్షన్కు ‘వాతి’ అనే టైటిల్స్ ఖరారు చేశారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించనుంది. గురువారం ఈ చిత్ర టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ‘యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్’ అంటూ టైటిల్ రివీల్ వీడియోలో సినిమా కథ గురించి తెలియజెప్పారు. టైటిల్లో కలం బొమ్మ కనిపిస్తున్నది. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో ధనుష్ జూనియర్ కాలేజీ లెక్చరర్గా నటించనున్నారని, విద్యార్థులకు ఆదర్శప్రాయుడైన అధ్యాపకుడిగా ఆయన పాత్ర సాగుతుందని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను జనవరిలో ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది. సాయికుమార్, తనికెళ్లభరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: దినేష్కృష్ణన్, సంగీతం: జీవీ ప్రకాష్కుమార్, ఎడిటర్: నవీన్నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.