న్యూఢిల్లీ : అంతర్జాతీయ ప్రయాణికులు విమాన టికెట్ల ధరలకు సంబంధించి డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్) కీలక సూచనలు చేసింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో వాస్తవమైన ధరలు ఉండకపోవచ్చని, ఈ మేరకు టికెట్ల ధరలను నేరుగా విమానయాన వెబ్సైట్లలోనే చూసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం భారత ప్రయాణికులపై ఆంక్షలను ఎత్తి వేసిన విషయం తెలిసిందే.
బ్రిటన్లో కళాశాలల అడ్మీషన్ సీజన్ కావడంతో లండన్కు వెళ్లే విమాన టికెట్ల ధరలను ఇటీవల ఆయా విమానయాన సంస్థలు భారీగా పెంచేశాయంటూ వార్తలు వచ్చాయి. ఢిల్లీ-లండన్ మార్గంలో బ్రిటిష్ ఎయిర్వేస్ టికెట్ ధర ఆగస్ట్ 26వ తేదీకి రూ.3.95 లక్షలు పలుకుతోందని కేంద్ర హోంశాఖ ఇంటర్స్టేట్ కౌన్సిల్ సెక్రెటేరియట్ సెక్రెటరీ సంజీవ్ గుప్తా ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందిస్తూ.. ఆగస్టు నెలలో ఢిల్లీ-లండన్ మధ్య ఎకానమి క్లాస్ టికెట్ ధర రూ. 1.03లక్షల నుంచి రూ. 1.47లక్షలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే గూగుల్ వంటి మెటా సెర్చ్ ఇంజిన్లలో ఒక్కోసారి ఎయిర్లైన్ వెబ్సైట్లలో ఉండే ధరల కంటే ఎక్కువ ధరలు చూపిస్తున్నాయని, దీంతో గందరగోళ సమస్యలు తలెత్తుతున్నాయని డీజీసీఏ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో డీజీసీఏ ప్రయాణికులకు సూచనలు చేసింది. మరోవైపు టికెట్ ధరలకు సంబంధించి విమానయాన సంస్థలకు కూడా డీజీసీఏ పలు ఆదేశాలు జారీ చేసింది. మెటా సెర్చ్ ఇంజిన్లలో విమాన టికెట్ ధరలు ఎయిర్లైన్ వెబ్సైట్లలో కంటే ఎక్కువ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.