చెర్నీవ్, ఏప్రిల్ 8: యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తున్నా రష్యా రక్తదాహం తగ్గడం లేదు. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నా ఉక్రెయిన్లో మారణహోమం ఆగడం లేదు. వీధుల్లో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. శిథిలాల కింద ఉక్రెయిన్ పౌరుల శరీరాలు చితికిపోతున్నాయి. తుపాకీ గుండ్లతో తూట్లు పడుతున్నాయి. షెల్లింగ్లో జల్లెడలవుతున్నాయి. గురువారం కీవ్ నుంచి వెనక్కు వెళ్లిన రష్యా బలగాలు తూర్పు ఉక్రెయిన్లో మానవ విధ్వంసానికి దిగాయి. వేలాది మంది ఉన్న క్రమటార్క్స్ పట్టణ రైల్వే స్టేషన్పై రాకెట్ దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో 50 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాత్రులు, ప్రజల హాహాకారాలతో రైల్వే స్టేషన్ అంతటా భీతావహ వాతావరణం నెలకొన్నది. రష్యా దాడులకు భయపడి దేశం నుంచి వెళ్లిపోయే వారిని తరలించడానికి ఈ రైల్వే స్టేషన్ను ఉపయోగిస్తున్నారు. రష్యా ఇక్కడితో ఆగదని, మరిన్ని దాడులకు పాల్పడవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. అయితే, క్రమటార్క్స్ రైల్వే స్టేషన్ మీద రాకెట్ దాడిలో తమ ప్రమేయం లేదని రష్యా పేర్కొన్నది.
బుచాలో ప్రజలు కేవలం బాంబు దాడుల్లో మాత్రమే చనిపోలేదని ఆ నగర మేయర్ వెల్లడించారు. రష్యా బలగాలు నగర ప్రజలను బృందాలుగా మార్చి వేర్వేరు చోట్ల వారిని సామూహికంగా కాల్చి చంపినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. కనీసం మూడు చోట్ల సామూహిక హత్యలు జరిగాయని పేర్కొన్నారు. చనిపోయినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మృతుల్లో చాలా మంది చేతులు కట్టేసి ఉన్నట్టు వెల్లడించారు. బుచాలో అధికారిక లెక్కల ప్రకారం 320 మంది చనిపోయారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతున్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు ఈ నగరంలో 50వేల మంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 3,700 మంది ఉన్నారు. ఉక్రెయిన్లో తన మారణహోమాన్ని కప్పి పెట్టడానికి రష్యా మొబైల్ శ్మశాన వాటికలను తిప్పుతున్నది. మృతుల దేహాలను ఎప్పటికప్పుడు దహనం చేస్తే తమ రాక్షసత్వం ప్రపంచానికి తెలియకుండా ఉంటుందని దాని భావన. కాగా, ఉక్రెయిన్తో యుద్ధంలో 1,351 మంది తమ సైనికులు చనిపోయినట్టు రష్యా వెల్లడించింది. వాస్తవంలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
కీవ్ సమీపంలోని బొరొదియాంకలో రెండు భవనాల కింద హృదయ విదారక స్థితిలో 26 మృతదేహాలు దొరికాయి. రష్యా సైనికులే వీరిని కాల్చి చంపినట్టు భావిస్తున్నారు. ‘బుచా కేవలం ప్రారంభం మాత్రమే. బొరొదియాంకలో ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. బుచా కంటే ఇక్కడ మరింత భయానక పరిస్థితి ఉంది’ అని జెలెన్స్కీ అన్నారు. ‘హద్దుల్లేని క్రూరత్వం ఇది. శిక్షించకపోతే ఇక్కడితో ఆగదు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఉక్రెయిన్ బాలికలపై రష్యా బలగాలు లైంగిక దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆడవాళ్లంతా తమ జుట్లను కత్తరించుకొంటున్నారు. రష్యా బలగాలకు ఆకర్షణీయంగా కనిపించకూడదన్న ఉద్దేశంతో ఈ పనిచేస్తున్నారు.