న్యూఢిల్లీ: 2021కిగాను ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాల( safest city ) జాబితాను రిలీజ్ చేసింది ఓ సర్వే. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రతి ఏటా ఈ సర్వే నిర్వహిస్తుంది. ఈ ఏడాది కరోనా కారణంగా ఈ సురక్షిత నగరాల జాబితాలో చాలా మార్పులే వచ్చాయి. ప్రతి ఏటా జపాన్ రాజధాని టోక్యో, సింగపూర్ టాప్ 2లో ఉండేవి. అయితే ఈ ఏడాది ఆ స్థానాన్ని డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ ఎగరేసుకుపోయింది. డెన్మార్క్ తర్వాతి స్థానంలో కెనడా నగరం టొరంటో నిలిచింది. సింగపూర్ మూడో స్థానానికి పడిపోయింది.
ఢిల్లీ, ముంబైలు టాప్ 50లో..
ఈ సర్వేలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 60 నగరాలను పరిగణనలోకి తీసుకున్నారు. డిజిటల్, హెల్త్, వ్యక్తిగత భద్రత, పర్యావరణం, మౌలిక సదుపాయాల రంగం వంటి 76 అంశాల్లో 100కుగాను స్కోర్లు కేటాయించారు. ఈఐయూ 2015 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈసారి మన ఢిల్లీ, ముంబైలకు కూడా టాప్ 50లో చోటు దక్కింది. ఢిల్లీ 56.1 పాయింట్లు, ముంబై 54.4 పాయింట్లు స్కోరు చేశాయి.
కొవిడ్ కారణంగా ఈసారి అర్బన్ సేఫ్టీ విషయంలో మార్పులు స్పష్టంగా చోటు చేసుకున్నాయని, వ్యాపారాలు ఆన్లైన్కు మారడంతో డిజిటల్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యంగా మారిందని ఈఐయూ తెలిపింది. ఇక అసలు సురక్షితం కాని నగరాల జాబితాలో యాంగోన్, లాగోస్, కారకస్, కైరో, కరాచీ ఉన్నాయి.