హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియా..విద్యుత్ కంపెనీలకు సరిపడా బొగ్గును సరఫరా చేయడంలో విఫలంకావడంతో ఆయా సంస్థలు ప్రత్యామ్నాయలను వెతుకుతున్నాయి. దీంట్లో భాగంగా పలు విద్యుత్తు కేంద్రాలు సింగరేణి వైపు తమ దృష్టి సారిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ప్లాంట్ యూనిట్-1 కోసం సింగరేణి నుంచి బొగ్గును తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ఒప్పందాన్ని కూడా చేసుకోవడం గమనార్హం.
ఇరు సంస్థల మధ్య ఒప్పందం
హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సోమవారం షోలాపూర్ ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల మధ్య బొగ్గు సరఫరాకు సంబంధించిన ఒప్పందం (ప్యూయల్ సైప్లె అగ్రిమెంట్) జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం షోలాపూర్ ఎన్టీపీసీ యూనిట్-1కు ఏడాదికి 25.40 లక్షల టన్నుల బొగ్గును 25 ఏండ్లపాటు సరఫరా చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఎన్టీపీసీ ప్లాంట్… కోల్ ఇండియా నుంచి బొగ్గును తీసుకోవాల్సి ఉంది. కానీ ఎన్టీపీసీ మాత్రం తాము కోల్ ఇండియా నుంచి తీసుకోమని.. సింగరేణి నుంచి తీసుకుంటామని, అందుకు అనుమతించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. నాణ్యత, నిరంతరం సరఫరా, దూరం తదితర అంశాలలో సింగరేణి నుంచి బొగ్గును కొనుగోలుచేయడం శ్రేయస్కరమని భావించింది. ఇప్పటికే 8 రాష్ర్టాల్లోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నది సింగరేణి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు.. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లోని ప్లాంట్లకు ప్రస్తుతేడాది 135.30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయాలని గతంలోనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
సింగరేణిపై ప్రశంసలు
సింగరేణిపై కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వీ పొన్నురాజు ప్రశంసలు కురిపించారు. సింగరేణి బొగ్గుతో కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం 3 థర్మల్ విద్యుత్తు కేంద్రాలు సజావుగా నడుస్తున్నాయని, ఇందుకు సంస్థ అందిస్తున్న సహకారం అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని రాయచూర్, యరమారస్, బళ్ళారి ప్లాంట్లకు కావాల్సిన 10 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఎటువంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తున్నదని, వీలైతే రోజువారీ సరఫరాను మరింత పెంచాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.