ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. కరోనా వైరస్ కలకలం రేపిన వేళ అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పంజాబ్ కింగ్స్పై విజయదుందుభి మోగించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ బౌలర్ల కట్టడితో స్వల్ప స్కోరుకే పరిమితమైన పంజాబ్.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలోనూ పోరాట పటిమ కనబర్చలేక భారీ ఓటమి చవిచూసింది. మొత్తంగా ఢిల్లీ, పంజాబ్ పోరు వార్ వన్సైడ్ అన్నట్లు సాగింది.
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జూలు విదిల్చింది. కరోనా వైరస్ కేసులతో జట్టులో అలజడి చెలరేగినా.. ఆత్మవిశ్వాసం కోల్పోని క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్పై పదునైన పంజా విసిరింది. బుధవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో కింగ్స్పై ఘన విజయం సాధించింది. తొలుత కుల్దీప్యాదవ్ (2/24), అక్షర్ పటేల్ (2/10), లలిత్ యాదవ్ (2/11), ఖలీల్ అహ్మద్ (2/21) విజృంభణతో పంజాబ్ 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో పంజాబ్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. జితేశ్ శర్మ (32), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ధవన్ (9), బెయిర్స్టో (9), లివింగ్స్టోన్ (2), షారుఖ్ఖాన్(12) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. స్పిన్ ద్వయం కుల్దీప్, అక్షర్ పటేల్ పంజాబ్ బ్యాటింగ్ నడ్డివిరిచారు. తర్వాత స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 10.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (30 బంతుల్లో 60 నాటౌట్, 10 ఫోర్లు, సిక్స్), పృథ్వీషా (20 బంతుల్లో 41, 7ఫోర్లు, సిక్స్) ధనాధన్ బ్యాటింగ్తో అలరించారు. వీరిద్దరు పంజాబ్ బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టారు. మొదట షా దూకుడుగా ఆడితే ఆ తర్వాత వార్నర్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. చాహర్ బౌలింగ్లో షా ఔట్ కావడంతో తొలి వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. సర్ఫరాజ్ఖాన్ (12)తో కలిసి వార్నర్ ఢిల్లీకి భారీ విజయాన్ని కట్టబెట్టాడు. పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకున్న కుల్దీప్యాదవ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా గురువారం ఐపీఎల్ ‘ఎల్క్లాసికో’ ముంబై, చెన్నై మధ్య పోరు జరుగనుంది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 115 ఆలౌట్ (జితేశ్శర్మ 32, మయాంక్ 24, అక్షర్పటేల్ 2/10, కుల్దీప్యాదవ్ 2/24), ఢిల్లీ: 10.3 ఓవర్లలో 119/1(వార్నర్ 60 నాటౌట్, పృథ్వీషా 41, చాహర్ 1/21)