న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీ పోలీసు అధికారుల్లో ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో నిరసన చేపట్టకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు రైతు సంఘాలను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం సంఘాల నేతలతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నేత శివకుమార్ కక్కా మాట్లాడుతూ సింగు సరిహద్దు నుంచి పార్లమెంట్కు ప్రతి రోజు 200 మంది రైతులు కవాతు నిర్వహిస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి నిరసనకారుడికి గుర్తింపు ఉంటుందని, వారి జాబితా సైతం ప్రభుత్వానికి ఇస్తామన్నారు.
అయితే, నిరసనకారుల సంఖ్య తగ్గించాలని పోలీసులు కోరారని, దానికి తాము సిద్ధంగా లేమన్నారు. సమావేశానికి ముందు బీకేయూ నేత రాకేశ్ తికాయిత్ మాట్లాడుతూ నిరసనకు అనుమతిచ్చేందుకు పోలీసులు సిద్ధంగా లేరన్నారు. అయితే, రైతుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో ఏడు మెట్రో రైల్వేస్టేషన్ల పోలీసులు అప్రమత్తం చేశారు. ఆయా స్టేషన్లను ఢిల్లీ పోలీసుల నిఘా ఉంచాలని, అవసరమైతే వాటిని మూసివేయడానికి సన్నాహాలు చేయాలని డీఎంఆర్సీకి లేఖ రాశారు. ఇందులో జన్పథ్, లోక్ కల్యాణ్ మార్గ్, పటేల్ చౌక్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండి హౌస్, ఉద్యోగ్ భవన్ స్లేషన్లు ఉన్నాయి.