ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని విదేశీ ప్లేయర్కు కరోనా సోకినట్లు తేలింది. ఆ ప్లేయర్కు నిర్వహించిన పరీక్షలో అతను కోవిడ్ పాజిటివ్ అని తేలాడు. దీంతో డీసీ జట్టు పుణె పర్యటన ఇవాళ రద్దు అయ్యింది. బుధవారం పంజాబ్తో పుణెలో డీసీ ఐపీఎల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. డీసీ జట్టులోని ఆస్ట్రేలియా ఆల్రౌండర్కు కరోనా సంక్రమించినట్లు తెలుస్తోంది. అతనికి స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో అతను పాజిటివ్గా తేలాడు. తదుపరి మ్యాచ్ కోసం పుణెకు వెళ్లాల్సిన డీసీ జట్టు సభ్యుల ప్రయాణాన్ని రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. ప్లేయర్లు అందరూ రూమ్లకే పరిమితం అయ్యారని, అందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయాల్సి ఉందన్నారు.
ఆ జట్టులోని సపోర్ట్ సిబ్బందికి కూడా కరోనా సంక్రమించింది. ప్రస్తుతం కాన్రాడ్ హోటల్లో అన్ని జట్లు బస చేస్తున్నాయి. అయితే నెగటివ్ వచ్చిన ప్లేయర్లు మాత్రమే రేపు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. గత ఏడాది కూడా కోవిడ్ రెండవ దశ ఉధృతి వల్ల ఐపీఎల్ను మధ్యలోనే రద్దు చేశారు. ఆ తర్వాత మిగితా మ్యాచ్లను యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే. డీసీ జట్టులో ఉన్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఒక్కడే. నిజానికి మార్ష్ ఇటీవల గాయం నుంచి కోలుకున్నాడు. ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్తో అతను ఇటీవల చాలా వరకు కాంటాక్ట్లో ఉన్నాడు. మిచెల్ మార్ష్కు కరోనా సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు.