హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నప్పటికీ కామారెడ్డి, మెదక్ జిల్లాలో మినహా ఏ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదుకాలేదు. ఇప్పటికీ 15 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జోగుళాంబ- గద్వాలలో అతి తక్కువ రోజులు వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు.
జూన్ 1 నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 47 రోజుల పాటు వర్షాలు కురిశాయి. అయినప్పటికీ ఎక్కడ అధిక వర్షపాతం నమోదు కాలేదు. ఈ సీజన్లో మెదక్ జిల్లాలో అత్యధికంగా 44 రోజులు, కామారెడ్డిలో 43 రోజులు వర్షాలు కురిశాయి. అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 17 రోజులు వర్షాలు పడ్డాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని కారణంగా తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణశాఖ వెల్లడించింది.